అమరావతి: విద్యుత్ కొనుగోలు ఒప్పందాల విషయంలో జగన్మోహనరెడ్డి ప్రభుత్వం నిజాలు వక్రీకరిస్తూ ఇష్టానుసారంగా మాట్లాడుతోందని టిడిపి అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. మంగళగిరి హాపిరిసార్ట్స్ లో బుధవారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ, విద్యుత్ ధరలపై ప్రభుత్వం అసత్య ప్రచారాలు చేస్తోందని చంద్రబాబు మండిపడ్డారు. ప్రజలకు తప్పుడు సమాచారం ఎందుకు ఇస్తున్నారని చంద్రబాబు ప్రశ్నించారు.
ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు పంపుతూ పబ్బం గడుపుకుంటున్నారని చంద్రబాబు విమర్శించారు. కేంద్ర ఇంధన శాఖ అజమాయిషీలో జరిగే విద్యుత్ కొనుగోలు ఒప్పందాల వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం పాత్ర నామమాత్రమని చంద్రబాబు చెప్పారు. దీనిపై అధికారులు మీడియా సమావేశం పెట్టడమే తప్పని చంద్రబాబు అన్నారు.
అయిదేళ్లకు ముందు భారీగా కరెంటు కోత ఉండేదనీ, నిరంతరం కరెంట్ ఇవ్వాలన్న ఉద్దేశంతో ముందుకు వెళ్లడం వల్ల ఇప్పుడు మిగులు విద్యుత్తు సాధించామని చంద్రబాబు వివరించారు. 2021నాటికి సంప్రదాయేతర ఇంధన వనరుల వాటా 20శాతానికి చేరాలని చంద్రబాబు అన్నారు.
విద్యుత్ పిపిఎలను సమీక్షిస్తామనడం సరికాదని చంద్రబాబు పేర్కొన్నారు. టెండర్ల విషయంలో సిట్టింగ్ జడ్జిలు జోక్యం చేసుకోరనీ, జగన్ ఏర్పాటు చేస్తామన్న జ్యూడిషియల్ కమిషన్ సాధ్యం కాదని చంద్రబాబు అన్నారు. ఉత్పత్తి చేసే ప్రతి యూనిట్కు రూపాయిన్నర ఇన్సెంటివ్ వస్తుందని చంద్రబాబు చెప్పారు. ఆరు రూపాయల 99 పైసలతో కరెంటు తీసుకున్న సందర్భాలు లేవని చంద్రబాబు స్పష్టం చేశారు.
ధర్మల్ విద్యుత్ వల్ల ప్రపంచ వ్యాప్తంగా సమస్యలు వస్తున్నాయని చంద్రబాబు అన్నారు. అందరూ సౌర, పవన విద్యుత్ వైపు వెళ్తున్నారని చంద్రబాబు చెప్పారు. కాలుష్యం తగ్గించేందుకే పునరుత్పాదక ఇంధన వనరుల వైపు వెళ్లామని చంద్రబాబు తెలియజేశారు.