Pakka commercial : ‘పక్కా కమర్షియల్’..ప్రస్తుతం సెట్స్ మీదున్న పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్. మారుతి ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తుండగా మాస్ ఆడియన్స్లో మంచి క్రేజ్ ఉన్న గోపీచంద్ హీరోగా నటిస్తున్నాడు. ఆయనకి జంటగా బబ్లీ బ్యూటీ రాశీఖన్నా నటిస్తోంది. టాలీవుడ్లో మారుతి సినిమాలకి ప్రేక్షకుల్లో ఎంతటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే.
ఒకే సారి మూడు నాలుగు సినిమాలు చేస్తూ హడావిడి పడకుండా స్లో అండ్ స్టడీ విన్ ది రేస్ అన్నట్టుగా సినిమా తర్వాత సినిమా చేసుకుంటూ వస్తున్నాడు. కెరీర్ ప్రారంభంలో యూత్ ఆడియన్స్ కోసమే సినిమాలు చేసిన మారుతి గత కొంతకాలంగా మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ తో ఫ్యామిలీ ఆడియన్స్ని బాగా ఆకట్టుకుంటున్నాడు. ఈయన గత చిత్రం ‘ప్రతిరోజూ పండగే’ బాక్సాఫీస్ వద్ద మంచి కమర్షియల్ హిట్గా నిలిచిన సంగతి తెలిసిందే.
కాగా ప్రస్తుతం యాక్షన్ హీరో గోపీచంద్తో ‘పక్కా కమర్షియల్’ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇటీవలే కోర్ట్ సన్నివేశం తెరకెక్కిస్తున్నట్టుగా మారుతి.. హీరోయిన్ రాశీఖన్నా పిక్ కూడా బయటికి వదిలారు. ఇక ప్రస్తుతం గోపీచంద్ ‘పక్కా కమర్షియల్’ సినిమా మీద బాగా నమ్మకాలు పెట్టుకున్నాడట. గత కొంతకాలంగా గోపీచంద్కి హిట్ అంటూ అకౌంట్లో చేరడం లేదు. ఈ మధ్యలో కరోనా వచ్చి చూస్తూ చూస్తూ రెండేళ్ళ గ్యాప్ కూడా వచ్చేసింది. ఇక రీసెంట్గా సంపత్ నంది దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా తెరకెక్కిన ‘సీటీమార్’ సినిమా రిలీజ్కి రెడీగా ఉంది.
తమన్నా హీరోయిన్గా నటించిన ఈ సినిమా కబడ్డీ ఆట నేపథ్యంలో తెరకెక్కింది. వాస్తవంగా ఈ నెలలోనే సీటీమార్ రిలీజ్ కావాల్సి ఉండగా చిత్ర యూనిట్ పోస్ట్పోన్ చేశారు. ‘సీటీమార్’ సినిమాతో మళ్ళీ సక్సస్ ట్రాక్ ఎక్కుతాడన్న నమ్మకంగా ఉన్న గోపీచంద్ మరూతి సినిమా ‘పక్కా కమర్షియల్’తో మళ్ళీ తన సత్తా చాటబోతున్నట్టు చాలా ధీమాగా ఉన్నాడట. మారుతి కూడా గోపీచంద్తో తీసే ‘పక్కా కమర్షియల్’ సినిమాతో గట్టిగానే హిట్ కొట్టబోతున్నట్టు టాక్ వినిపిస్తోంది. ‘సీటీమార్’, ‘పక్కా కమర్షియల్’ సినిమాలతో మళ్ళీ గోపీచంద్ సక్సస్ ట్రాక్ ఎక్కుతాడేమో చూడాలి.