సీఎం జగన్ ఢిల్లీ ఎందుకు వెళ్లినట్టు? జగనే అపాయింట్ కోరి వెళ్లారా.. లేదా ఢిల్లీ పెద్దలే కబురు పెట్టారా? విభజన బిల్లు హామీలు, పోలవరం ప్రాజెక్టు నిధులు, జీఎస్టీ బకాయిలు.. అడిగారా? లేక న్యాయవ్యవస్థపై దాడి చేయడం సరైంది కాదు.. అని హెచ్చరించారా? దురదృష్ణవశాత్తూ ఏ మీడియా కూడా జగన్ ఢిల్లీ యాత్ర మతలబు ఏంటి.. భేటీల్లో ఏం జరిగింది అనే విషయాలు వెల్లడించలేదు. దీంతో సగటు ఏపీ వాసికి తెలీకుండా పోయింది.
ఎవరికి తోచించి వారు రాసేస్తున్నారు..
జగన్ ఢిల్లీ టూర్ పై ఏపీ మీడియా ఎవరికి తోచింది వారు రాసేసుకుంటున్నారు. ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతితోపాటు తోక పత్రికలు కూడా వారి ఇష్టం వచ్చినట్టు రాసేస్తున్నాయి. పోలవరం ప్రాజెక్టు నిధులు, జీఎస్టీ బకాయిలు ఇచ్చి రాష్ట్రాన్ని ఆదుకోండి.. అని సాక్షి రాసింది. దాదాపు 50 నిమిషాలు జరిగిన అమిత్ షా – జగన్ భేటీలో విషయాలు తెలీలేదు అంటూనే రాష్ట్రానికి నిధులు ఇవ్వాలని జగన్ కోరినట్టు రాసింది. అయితే.. ఆంధ్రజ్యోతి మాత్రం జగన్-షా మధ్య కూర్చుని విన్నట్టుగా ఇష్టంవచ్చినట్టు రాసేశారు. ‘న్యాయ వ్యవస్థపై దాడి చేస్తున్నారు.. అన్నింటినీ పరిశీలిస్తున్నాం..’ అని జగన్ కి అమిత్ షా వార్నింగ్ ఇచ్చినట్టు వ్యతిరేకంగా రాసేశారు. వీటన్నింటికీ భిన్నంగా వార్త.. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరినట్టు రాసేసింది. ఇలా ఎవరికి తోచినట్టు వారు రాసేసి ఏపీ మీడియా అసలు రూపం చూపించాయి.
రాజకీయ కారణాలు.. పాలనా కారణాలు ఉండొచ్చు..
ప్రస్తుత ఏపీ పరిస్థితులను బట్టి అమిత్ షా-జగన్ మధ్య ఏం జరిగిందో ఊహించొచ్చు. ప్రస్తుతం ఏపీలో న్యాయవ్యవస్థపై వైసీపీ ప్రభుత్వం గుర్రుగా ఉంది. పార్లమెంట్లో కూడా ఏపీ ఎంపీలు ఈ విషయాల్ని ప్రస్తావించారు. ఏపీలో రాజధాని వికేంద్రీకరణ, అమరావతి వికేంద్రీకరణ, తిరుమల డిక్లరేషన్, దేవాలయాలపై దాడి అంశాలు ప్రముఖంగా వార్తల్లో నిలుస్తున్నాయి. ఈ విషయాలేవీ వారిద్దరి మధ్య ప్రస్తావనకు రాలేదంటే నమ్మలేం. నిధుల కోసమే అయితే అమిత్ షాను కలిసే అవసరం లేదు. రాజకీయ అంశాలపైనే అమిత్ షాను కలిసే అవకాశముంది. మరి వీరిద్దరి మధ్య భేటీలోని అంశాలను పార్టీ గుర్తులు, రంగుల ప్రకారం కాకుండా ప్రజలకు నిజమైన వార్తలు అందించాల్సిన అవసరం ఉంది.