Megastar : సినిమా టికెట్ల ధరలపై నెలకొన్న వివాదానికి ఓ కొలిక్కి తీసుకురావాలని ఏపి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. ఈ నేపథ్యంలో ఏపి సీఎం వైఎస్ జగన్మోహన రెడ్డిని సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని మంగళవారం భేటీ అయ్యారు. తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో జగన్ తో భేటీ అయిన మంత్రి పేర్ని నాని..సినిమా టికెట్ల ధరల పెంపు అంశంపై చర్చించారు. సినిమా టికెట్ల ధరల పెంపుపై ప్రభుత్వం నియమించిన కమిటీ చేసిన అధ్యయనంపై వీరు చర్చించారు. ఈ నెల 10వ తేదీన సీఎం వైఎస్ జగన్ తో చిరంజీవి, నాగార్జున సహా ఇతర సినీ పెద్దలు సమావేశం జరగనున్న నేపథ్యంలో మంత్రి పేర్ని నాని సీఎంతో భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
Megastar: సీఎం జగన్ తో మంత్రి పేర్ని నాని చర్చలు
సినిమా టికెట్ల ధరల పెంపునకు సంబంధించి కమిటీ నివేదిక కూడా సిద్ధం అయింది. సినిమా టికెట్ల కనీస ధర, గరిష్ట ధరలు ఎంత ఉండాలనే అంశంపై సీఎం జగన్, మంత్రి పేర్ని నాని చర్చలు జరిపారు. చిరు, నాగార్జున భేటీలో వారి అభిప్రాయాలు తీసుకుని చర్చించి సీఎం జగన్ తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఇదే క్రమంలో సినిమా థియేటర్ల యాజమానుల సమస్య పరిష్కారంపైనా జగన్ చర్చ నిర్వహించనున్నారు.
ఏపీలో ఇటీవల సినిమా టికెట్ ధరల వ్యవహారం తీవ్ర చర్చనీయాంశం అయ్యింది. ప్రభుత్వంపై సినీ రంగానికి చెందిన వాళ్లు విమర్శించడం దానికి రియాక్షన్ గా సినిమా వాళ్లపై వైసీపీ నేతలు, మంత్రులు ప్రతి విమర్శలు చేయడంతో ఈ వివాదం ఏపి ప్రభుత్వం, సినీ పరిశ్రమ మధ్య పెద్ద సమస్యగా తయారైంది. ఈ నేపథ్యంలో గత నెల ఏపి సీఎం వైఎస్ జగన్ తో భేటీ అయి సినీ పరిశ్రమ సమస్యలపై చర్చించారు. ఈ క్రమంలోనే పలు అంశాలను చిరంజీవి జగన్ కు వివరించారు. త్వరలో సామరస్య పూర్వక పరిష్కారం లభిస్తుందని నాడు చిరంజీవి వెల్లడించారు.