YS Jagan: పీఆర్సీ సమస్యపై ఇటీవల ఉద్యోగుల ఆందోళన ఉవ్వెత్తున లేచింది. ఉద్యోగ సంఘాలు అన్నీ ఏకమై ఉద్యమ కార్యాచరణ ప్రకటించి ఆందోళనలు చేశారు. ప్రభుత్వ ఆంక్షల నేపథ్యంలోనూ చలో విజయవాడ కార్యక్రమం విజయవంతం అయ్యింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఉద్యోగ సంఘాల నేతలతో చర్చలు జరిపి వారిని కొంత మేర సంతృప్తి పర్చి ఆందోళన విరమింపజేసిన సంగతి తెలిసిందే. అయితే ఒప్పంద ప్రక్రియను విభేదించిన పలు ఉపాధ్యాయ సంఘాలు ఉద్యోగ జేఏసి నుండి బయటకు వచ్చి ఆందోళన బాట పట్టాయి. రాష్ట్ర వ్యాప్తంగా పలు ఉపాధ్యాయ సంఘాలు ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. ఉపాధ్యాయుల ఆందోళన వెనుక కమ్యునిస్టు పార్టీలు ఉండటంతో ఇదంతా చంద్రబాబు, ఎల్లో మీడియా కుట్రగా వైసీపీ భావిస్తోంది.
YS Jagan: వాళ్లకే ఉద్యోగుల సమ్మె కావాలి
దీనిపై నేడు సీఎం వైఎస్ జగన్ తీవ్రంగా స్పందించారు. ఎదుట ఎర్ర జెండా ..వెనుక పచ్చ జెండా అన్న చందంగా టీడీపీ అధినేత చంద్రబాబు వ్యవహరిస్తున్నారని జగన్ పేర్కొన్నారు. ఎర్రజెండా, పచ్చ జెండాలు కలిసి రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తున్నారని జగన్ విమర్శించారు. జగనన్న చేదోడు రెండో ఏడాది నగదు విడదల కార్యక్రమంలో మాట్లాడిన సీఎం జగన్..పేదల ఇళ్లను అడ్డుకున్న చంద్రబాబు కామ్రేడ్లకు మిత్రుడు అని విమర్శించారు. చంద్రబాబుకు, ఆయన అనుకూల మీడియాకు మాత్రమే ఉద్యోగుల సమ్మె కావాలన్నారు. ఉద్యోగులు సమ్మె విరమించారు అనగానే కామ్రేడ్ లను ముందుకు తోశారన్నారు. ఎర్ర జండా వెనుక పచ్చ జెండా ఉందన్నారు. సీఎంను తిడితే ఇంకా బాగా కవరేజ్ ఇస్తారన్నారు. ఉపాధ్యాయులను వీళ్లే రెచ్చగొట్టారని మండిపడ్డారు. ఈనాడు, రామోజీరావుకు వాస్తవాలు కనిపించవా అని జగన్ ప్రశ్నించారు.