BJP: దేశంలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ కేంద్రంలోని మోడీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకోబోతున్నదా .. అంటే రాజకీయ వర్గాలు అవననే అంటున్నాయి. లోక్ సభ ముందస్తు ఎన్నికలు వస్తాయని ఊహగానాలు వస్తున్న తరణంలోనే సెప్టెంబర్ లో పార్లమెంట్ అమృత్ కాల్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించింది. సెప్టెంబర్ 18 నుండి 22వ తేదీ వరకూ అయిదు రోజుల పాటు పార్లమెంట్ స్పెషల్ సెషన్ నిర్వహించనున్నారు. అయితే ఈ సమావేశాల్లోనే కేంద్రం ప్రత్యేక బిల్లు ప్రవేశపెట్టనున్నదంటూ వార్తలు వినబడుతున్నాయి.
యూనిఫామ్ సివిల్ కోడ్ బిల్లు ను ప్రవేశపెట్టనున్నదని వార్తలు వినబడుతున్నాయి. అంతే కాకుండా పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో జమిలి ఎన్నికల (వన్ నేషన్, వన్ ఎలక్షన్ బిల్లు) బిల్లు ప్రవేశపెట్టే అవకాశాలు కూడా ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఒక దేశం..ఒకే ఎన్నిక బిల్లు ప్రవేశపెట్టే అవకాశం ఉందని జోరుగా వినిపిస్తొంది. వన్ నేషన్, వన్ ఎలక్షన్ ద్వారా లోక్ సభ ఎన్నికలు, వివిధ రాష్ట్రాల అసెంబ్లీ లకు ఒకే సారి ఎన్నికలు నిర్వహించాలనే ఆలోచనలో కేంద్రం ఉన్నట్లు తెలుస్తొంది. ఇప్పటికే ఈ ప్రతిపాదనను అధ్యయనం చేసిన లా కమిషన్ ఆఫ్ ఇండియా కూడా కసరత్తు చేస్తున్నట్లుగా సమాచారం.
సాధారణంగా లోక్ సభ, రాష్ట్రాల అసెంబ్లీలకు గడువు ముగిసిన తర్వాత ఎన్నికలు జరుగుతాయి. అయితే వన్ నేషన్, వన్ ఎలక్షన్ అంటే లోక్ సభ ఎన్నికలతో పాటు రాష్ట్రాల అసెంబ్లీ కు ఒకే సారి ఎన్నికలు నిర్వహిస్తారు. ఈ క్రమంలోనే వన్ నేషన్, వన్ ఎలక్షన్ కింద కొన్ని రాష్ట్రాల అసెంబ్లీల కాలపరిమితి పెంచడం, మరి కొన్ని అసెంబ్లీల కాలపరిమితి తగ్గింపు ఉంటుంది. ఈ ప్రత్యేక సమావేశాల్లోనే దీనికి సంబంధించి బిల్లును పార్లమెంట్ లో ప్రవేశపెట్టే అవకాశం ఉందని అంటున్నారు. బిల్లు ఆమోదానికి 2/3 వంతు మెజారిటీతో రాజ్యాంగ సవరణ అవసరం ఉంటుంది.