ఏపీలో సంచలంగా మారిన ప్రొద్దుటూరు టీడీపీ అధికార ప్రతినిధి సుబ్బయ్య దారుణ హత్య ఉదంతంలో కొత్త విషయాలు బయటకు వచ్చాయి. అత్యంత దారుణంగా జరిగిన ఈ హత్యను ఒక పక్కా ప్లాన్ తోనే చేసినట్లు తెలుస్తోంది. ఈ హత్య వెనుక ప్రొద్దుటూరు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి మరియు ఆయన బావమరిది ఉన్నట్లుగా సుబ్బయ్య భార్య మరియు తల్లి ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉండగా, తాజాగా తనపై వస్తున్న ఇటువంటి ఆరోపణలకు ఎమ్మెల్యే స్పందించారు. తనపై వస్తున్న ఆరోపణలని తీవ్రంగా ఖండించారు.
సుబ్బయ్య హత్యకు గురయ్యేముందు జరిగిన సంఘటనలను పరిశీలిస్తే ఆయన్ని టార్గెట్ చేసి మరీ చంపినట్లుగా అర్ధమవుతుంది. ప్రొద్దుటూరు మండలంలోని ఈశ్వరరెడ్డి నగర్ లో నివసిస్తున్న సుబ్బయ్యను మంగళవారం ఉదయం 8.45 గంటలకు ఒక యువకుడు టూ వీలర్ మీద వచ్చి ఆయనను ఇంటికి వచ్చి ఆయన్ను బయటకు తీసుకెళ్లారు.
సరిగ్గా గంట తర్వాత సోములవారిపల్లె పంచాయితీ పరిధిలో ఆయన ఒక సెల్ఫీ తీసుకుని కడప వార్తలు అనే వాట్సప్ గ్రూపులో 9.40 గంటలకు పోస్టు చేశారు. ఇది జరిగిన పది నిమిషాలకు దుండగులు వచ్చి ఆయన కళ్లల్లో కారం కొట్టి ఆయన్ను చుట్టుముట్టి వేటకొడవళ్లతో మెడను నరికేశారు. దీంతో ఆయన అక్కడిక్కక్కడే కుప్పకూలిపోయారు.
అయితే పోలీసులు చెబుతున్న వివరాల ప్రకారం ఈ హత్యతో సంబంధం ఉందని భావిస్తున్న నలుగురు నిందితులు పోలీసుల అదుపులోకి తీసుకున్నారట. కానీ పోలీసులు మాత్రం ఆ వివరాలు వేటిని వెల్లడించటం లేదు. సుబ్బయ్య, స్థానిక YSRCP ఎమ్మెల్యే చేస్తున్న అవినీతిని బయటపెడుతుండటంతో తట్టుకోలేక ఇంత దారుణంగా హత్య చేయించినట్లుగా టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు.