అమరావతి: టిడిపి నాయకుడు నారా లోకేష్ వైసిపి ప్రభుత్వంపై కొత్త విసురు విసిరారు. ‘జె ట్యాక్స్’ పేరుతో వసూళ్లు సాగుతున్నాయని ఆరోపించారు. కియా కార్ల సంస్థ అనంతపురం దగ్గర ప్లాంట్లో స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వడం లేదని వైసిపి ఎంపీ గోరంట్ల మాధవ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన సందర్భాన్ని పురస్కరించుకుని ఆయన ఈ విమర్శ సంధించారు.
కియా ప్లాంట్లో తయారయిన మొదటి కారు విడుదల సందర్బంగా గురువారం మాధవ్, స్థానికులకు ఉద్యోగావకాశాలకు సంబంధించి దానిపై తన అసంతృప్తిని నమోదు చేసిన సంగతి తెలిసిదే. ఆ సందర్బంగానే కియా ప్రతినిధిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నఎంపీ మాధవ్ అంటూ స్థానికంగా దినపత్రికలో వచ్చిన ఫొటో వార్తను కలిపి లోకేష్ ట్వీట్ చేశారు.
‘కియా లాంటి అంతర్జాతీయ సంస్థనే ఈ రేంజ్లో బెదిరిస్తున్నారంటే స్థానిక పెట్టుబడిదారులను మీ జె ట్యాక్స్ కోసమెలా వణికిస్తున్నారో అర్ధమవుతోంది. వీలైతే నాలుగు కంపెనీలను రాష్ట్రానికి తీసుకురండి. అంతేకానీ మా కష్టంతో తెచ్చిన కంపెనీలను పులివెందుల పంచయితీలతో బెదిరించి తరిమేయకండి’ అని లోకేష్ ట్వీట్ చేశారు.
మీ దౌర్జన్యాలకు బెదిరి, వాళ్ళు వెళ్ళి మోడీగారి దగ్గర పంచాయతీపెడితే, మొన్న ఢిల్లీలో ఉండి సంజాయిషీ ఇచ్చుకున్నట్టుగా మళ్ళీ ఢిల్లీకి పరుగెత్తాల్సి ఉంటుంది. అయినా మీ నాయనగారికి ఇచ్చినమాట కోసం కియా వాళ్ళిక్కడ ప్లాంటు పెట్టారని చెప్పుకుంటూ ఈ దాడులేంటండీ @ysjagan గారు.
— Lokesh Nara (@naralokesh) August 9, 2019
మాజీ స్పీకర్ కోడెల కుటుంబం సత్తెనపల్లి, నర్సరావుపేట ప్రాంతంలో చేసిన వసూళ్లకు కె ట్యాక్స్ అని పేరు పెట్టారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత కె ట్యాక్స్ బాధితులు పోలీసు స్టేషన్ల ముందు బారులు తీరారు. ఆ సంగతి మరిచిపోక ముందే లోకేష్ ఇప్పడు జె ట్యాక్స్ ఆరోపణలు చేస్తున్నారు.