తిరువనంతపురం: భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమవుతున్న కేరళ రాష్ట్రంలో గురువారం నుంచీ 22 మంది ప్రాణాలు కోల్పోయినట్లు రాష్ట్రప్రభుత్వం ప్రకటించింది. వయనాడ్ జిల్లాలో గురువారం రాత్రి కొండ చరియలు విరిగిపడి ఒక టీ ఎస్టేట్లోని కూలీల ఇళ్లన్నీ కొట్టుకుపోయిన ఘటనలో సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. మట్టి కింద ిచిక్కుకుపోయిన వారిని వెలికి తీసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆ చుట్టుపక్కల కొద్ది స్థాయిలో చాలా చో్ట్ల కొండ చరియలు విరిగిపడిన కారణంగా సహాయ సిబ్బంది పనికి ఆటంకం కలుగుతోంది.
(10:42 గంటలు) అంతకుముందు:
మరోసారి భారీ వరదల బారిన పడిన కేరళ రాష్ట్రంలో పరిస్థితులు అల్లకల్లోలంగా ఉన్నాయి. వయనాడ్, ఇడుక్కి, మలప్పురం, కోళికోడ్ జిల్లాలలో అతి భారీ వర్షాలు, అసాధారణ భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికతో అధికారులు మరింత అప్రమత్తం అయ్యారు. వరదల కారణంగా కనీసం ఆరుగురు మరణించారు.
శుక్రవారం విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. కొచ్చి విమానాశ్రయాన్ని ఆదివారం వరకూ మూసివేశారు. పెరియార్ నదిలో, విమానాశ్రయం దగ్గరున్న ఒక కాలువలో నీటిమట్టం పెరుగుతోంది.
ముఖ్యమంత్రి పినరయి విజయన్ రాష్ట్ర విపత్తు నిర్వహణ విభాగం అధికారులతో కంట్రోల్ రూంలో సమావేశమయి పరిస్థితిని సమీక్షించారు.
వయనాడ్ జిల్లాలో గురువారం రాత్రి కొండ చరియలు విరిగిపడి ఒక టీ ఎస్టేట్లోని కూలీల ఇళ్లన్నీ కొట్టుకుపోయాయి. బరద మట్టి కింద 150 మంది చిక్కుకున్నారు. 200 మంది గాయపడ్డారు. ఇప్పటివరకూ రెండు మృతదేహాలను వెలికి తీశారు. సహాయచర్యలకు 12 గంటలు పట్టవచ్చని అధికారులు అంటున్నారు.
14 జిల్లాల్లో పాఠశాలలు, కాలేజీలు మూసివేశారు. 22 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. పట్టణంతిట్ట, కొట్టాయం, ఇడుక్కి, ఎర్నాకులం, త్రిసూర్ జిల్లాలలో గాలీవాన వస్తుందనీ, 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయనీ వాతావరణ శాఖ హెచ్చరించింది.
రాష్ట్రానికి మరో పది సహాయక బృందాలను పంపాల్సిందిగా కేరళ ప్రభుత్వం జాతీయ విపత్తు సహాయక దళాన్ని కోరింది. ఏడు బృందాలు శుక్రవారం చేరుకుంటాయని ఆశిస్తున్నారు.