ప్రకాశం జిల్లా అధికారుల పని పిల్లికి చెలగాటం ఎలక్కి ప్రాణ సంకటం మాదిరి ఉంది. కరోనా వ్యాప్తి నిరోధానికి వారు ఎన్నో చర్యలు తీసుకుంటున్నప్పటికీ ప్రజల నుండి వారికి కొత్త కొత్త ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
దీంతో వారు చేతులెత్తేసి సమస్యను పరిష్కరించాల౦టూ పోలీసులను ఆశ్రయించిన సంఘటన తాజాగా చోటు చేసుకుంది.వివరాల్లోకి వెళితే ప్రకాశం జిల్లాలో కరోనా పరీక్షల్లో పాజిటివ్ వచ్చిన దాదాపు 150 మందికి పైగా పేషెంట్లు పత్తా లేకుండా పోయారు. దీంతో వైద్యాధికారులు పోలీసులను ఆశ్రయించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. అయితే అధికార వర్గాలు ఈ విషయాన్ని గోప్యంగా ఉంచుతున్నాయి.కరోనా పరీక్షలు చేయించుకున్న వారు ఇచ్చిన ఆధార్ కార్డులో ఉన్న అడ్రస్ లలో బాధితులు లేకపోవడం, వారి సెల్ ఫోన్లు కూడా స్విచ్ఛాఫ్ లో ఉండటంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు.
దీంతో, వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు సీసీఎస్ పోలీసులతో దర్యాప్తు చేయిస్తున్నారు. మొత్తం 300ల మందికి పైగా జనాలు తమ అడ్రసులను తప్పుగా ఇచ్చారు. వీరిలో 150 మందికి పైగా వ్యక్తులకు పాజిటివ్ గా నిర్ధారణ అయింది. వీరిని పట్టుకోవడం అనేది ఇప్పుడు పోలీసులకు పెద్ద బాధ్యతగా మారింది. కాగా ఈ విషయమై ఒంగోలు రిమ్స్ ఆసుపత్రి కోవిడ్ యూనిట్ ఇన్చార్జి డాక్టర్ రిచర్డ్స్ స్పందించారు. కరోనా బాధితులు ప్రభుత్వ వైద్యశాలలో టెస్ట్లు చేయించుకొని ఫోన్ నెంబర్ , ఆధార్ నెంబర్, మరియు పేర్లను తప్పుడు సమాచారం ఇస్తున్నారని ఒంగోలు సర్వజన ప్రభుత్వ వైద్యశాల నోడల్ ఆఫీసర్ డాక్టర్ రిచర్డ్స్ శుక్రవారం మీడియాకు తెలియజేశారు.
ఇలా చేయడం వలన వారికి వారి కుటుంబానికి కరోనా వ్యాప్తి చెందుతుందని అన్నారు.ఇది కేవలం ఇరుగుపొరుగు వారికి తెలుస్తుంది అన్న భయంతోనే ఇలాంటి పనులు చేస్తున్నారని అన్నారు. కరోనా సోకిన వారం పది రోజులకే బాధితులు కేవలం జలుబు దగ్గుతో పూర్తిగా నయమయి తిరిగి వెళ్తున్నారు అని దీని వల్ల ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని తెలియజేశారు. ఇకనైనా టెస్టులు చేయించుకునే వారు తమ పూర్తి వివరాలను తెలియజేసి కరోనా వ్యాప్తి చెందకుండా అరికట్టాలని ఆయన కోరారు. కరోనా సోకితే తదుపరి సంభవించే పరిణామాలకు భయపడి ప్రజలు ఇలాగ చేస్తున్నారు అనుకున్నా వారి దాపరిక చర్యలు వినాశకర పరిణామాలకు దారితీసే ప్రమాదం పొంచి ఉంది.
ప్రకాశం జిల్లా లో ఇప్పుడు అడ్రస్ తప్పుగా ఇచ్చిన 150 మంది కరోనా పాజిటివ్ రోగులు ఎక్కడ తిరుగుతున్నారో …ఏం చేస్తున్నారో అని ఊహించుకుంటేనే భయం కమ్మేస్తోంది. ఏమో ఎవరికి కరోనా ఉందోనని ప్రజలు కూడా తమ సాటివారిని అనుమానించే పరిస్థితి తలెత్తుతోంది . ఇక అధికార యంత్రాంగానికి ప్రత్యేకించి పోలీసులకు ఊపిరాడని పని ఉండగా కొత్తగా కరోనా రోగులను వెతికి పట్టుకునే డ్యూటీ కూడా పడింది.