అంబటి రాంబాబు… తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాల గురించి తెలిసిన వారికి పరిచయం అవసరం లేని పేరు.
వైసీపీ తరఫున బలంగా గలం వినిపించే నాయకుడు అంబటి. అలాంటి అంబటికి ఇటీవల సొంత పార్టీలో నేతల నుంచే షాక్ తగిలింది. ఏకంగా హైకోర్టులో ఫిర్యాదు చేసే వరకు సీన్ చేరిపోయింది. ఈ పరిణామం రచ్చరచ్చగా మారింది. అయితే, తాజాగా దీని వెనుక ఆసక్తికర కారణం వెలుగులోకి వచ్చింది.
అసలేం జరిగింది?
వైసీపీ నేత, సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబుపై అమరావతిలోని ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో సంచలన ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ఎమ్మెల్యే అంబటి రాంబాబు అక్రమ మైనింగ్ చేస్తున్నారంటూ హైకోర్టులో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు పిటిషన్ దాఖలు చేశారు. రాజుపాలెం వైసీపీ కార్యకర్తల తరపున హైకోర్టు న్యాయవాది ఎం.నాగరఘు ప్రజా ప్రయోజవ్యాజ్యం దాఖలు చేశారు. రాజుపాలెం మండలం కోట నెమలిపురి, కొండమోడులో అక్రమ మైనింగ్ జరిగిందని పిటిషన్లో ఫిర్యాదుదారులు పేర్కొన్నారు.
భారీ అక్రమాలతో….
రాజుపాలెం మండలం కోట నెమలిపురి, కొండమోడులో అక్రమ మైనింగ్ జరిగిందని జిల్లా కలెక్టర్, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సీఎం జగన్ మోహన్ రెడ్డికి పిటిషన్లు పంపినా పట్టించుకోలేదని పిటిషన్లో ఆరోపించారు. అక్రమ మైనింగ్ విషయంలో ఇప్పటికే మైనింగ్ అధికారులు విచారణ జరిపారని పిటిషనర్లు పేర్కొన్నారు. అయితే, వైసీపీ కార్యకర్తలు వేస్తే ప్రజాప్రయోజన వ్యాజ్యం ఎలా అవుతుందని హైకోర్టు ప్రశ్నించింది. కోర్టుకు పూర్తి వివరాలు చెప్పాల్సిన భాధ్యత తనపై ఉందని న్యాయవాది నాగరఘు వెల్లడించారు. అక్రమ మైనింగ్ విషయంలో విచారణ జరపాలని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశించినా పట్టించుకోలేదని న్యాయవాది హైకోర్టు దృష్టికి తీసుకువచ్చారు. కాగా, అక్రమ మైనింగ్పై వెంటనే నివేదిక ఇవ్వాలని ప్రభుత్వ న్యాయవాదికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసి విచారణ వాయిదా వేసింది.
అంబటి బుక్కయినట్లేనా?
కాగా, అక్రమ మైనింగ్ ఆరోపణలు ఓ వైపు, ఏకంగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన ఉదంతం మరోవైపు ఉండటంతో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు ఇరుకున పడినట్లేనా? అనే చర్చ తెరమీదకు వస్తోంది. వైఎస్ఆర్సీపీ తరఫున, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తరఫున వకాల్తా పుచ్చుకొని బలంగా మాట్లాడే అంబటి రాంబాబుకు వ్యతిరేకంగా సొంత పార్టీ నేతలే హైకోర్టును ఆశ్రయించడంతో విపక్షాలు, అంబటి అంటే గిట్టని వారు ఆయన్ను సులవుగా టార్గెట్ చేసేశారు. ఇదే సమయంలో అంబటి రాంబాబు సన్నిహితులుగా ముద్ర పడ్డ ఇద్దరు నేతలు భూ కబ్జాల్లో ఇరుక్కున్నారు. ఈ వార్తలు మీడియాలో హైలెట్ అయ్యాయి. దీంతో ఏం జరగుతోందనే ప్రశ్న తెరమీదకు వచ్చింది.
ఒహ్…. అసలు కథ ఇదా?
ఎమ్మెల్యే అంబటి రాంబాబుకు వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన ఉదంతం రచ్చ రచ్చగా మారడం, మరోవైపు సొంత పార్టీ నేతలే అంబటిని ఇరకాటంలో పడేసేలా భూకబ్జాల్లో పాలుపంచుకోవడంతో అంబటి ఉక్కిరిబిక్కిరి అయిపోయారట. అయితే, ఈ విషయం గురించి అంబటి టీం లోతుగా ఆరాతీస్తే, కొత్త అంశం తెరమీదకు వచ్చిందంటున్నారు. ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి త్వరలో చేపట్టబోయే మంత్రి వర్గ విస్తరణ రేసులో అంబటి రాంబాబు ఉన్నారట. చాన్స్ దక్కవచి కూడా అంటున్నారు. అయితే, అంబటి రేపల్లె వాసి. సత్తెన్నపల్లిలో ఎమ్మెల్యేగా గెలిచి ఇక్కడే బలపడే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కొందరు స్థానిక నేతలు అంబటికి చెక్ పెట్టేందుకు ఇలా పొగ పెడుతున్నారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ విషయం సీఎం జగన్ దృష్టికి చేరిందా? ఒకవేళ చేరితే ఆయన ఎలా స్పందిస్తారు అనేది ఆసక్తికరమైన అంశం.