లోకల్ ఎన్నికల నోటిఫికేషన్ విషయంలో నిమ్మగడ్డకు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలిన సంగతి తెలిసిందే. దీంతో వైసీపీ శ్రేణులు ఫుల్ జోష్ లో ఉన్నారు. ఇటువంటి తరుణంలో మంత్రి కొడాలి నాని హైకోర్టు తీర్పు విషయంలో స్పందించారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు నిమ్మగడ్డ రమేష్ కుమార్ ని అడ్డంపెట్టుకుని వైసీపీ ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావడానికి ప్రయత్నాలు చేశారని ఆరోపించారు.
అయితే ఇలాంటి పరిస్థితుల్లో హైకోర్టు కుక్క కాటుకు చెప్పు దెబ్బ అన్నట్టుగా.. నిమ్మగడ్డకు సరైనరీతిలో తీర్పు ఇచ్చిందని పేర్కొన్నారు. ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కరోనా వైరస్ వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చాక, ప్రజలకు వ్యాక్సిన్ పంపిణీ చేయాల్సిన సమయంలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎన్నికలు నోటిఫికేషన్ విడుదల చేయడాన్ని హైకోర్టు తప్పుబట్టడం చాలా కరెక్ట్ అని కొడాలి నాని పేర్కొన్నారు.
రాజ్యాంగ బద్ధ పదవిలో ఉండి చంద్రబాబు రాజకీయ ప్రయోజనాల కోసం నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహరించిన తీరుకు సరైన తీర్పు వచ్చిందని హర్షించారు. కులం ముఖ్యమని నిమ్మగడ్డ రమేష్ కుమార్ చంద్రబాబు నాయుడు దగ్గర బూట్లు నాకెలాగా వ్యవహరిస్తూ చంద్రబాబు చెప్పిందే వేదం అనుకుంటే కోర్టులు ఉన్నాయి అంటూ కొడాలి నాని హెచ్చరించారు. ప్రభుత్వ వ్యవస్థలో ఏది చేస్తే అది జరిగే పరిస్థితి ఉండదని మొదటి నుంచి వైసీపీ చెబుతున్నట్లు ఈ సందర్భంగా పేర్కొన్నారు. అంతేకాకుండా ఇప్పటికైనా నిమ్మగడ్డ రమేష్ కుమార్ బుద్ధి తెచ్చుకుని చేసిన పొరపాట్లకు నైతిక బాధ్యత వహించి రిజైన్ చేయాలని కొడాలి నాని డిమాండ్ చేశారు. అప్పట్లో ఎన్నికలు ఆపటం ఎంత తప్పో ఇప్పుడు ఎన్నికలు పెట్టడానికైనా నిమ్మగడ్డ రెడీ అవటం అంతే తప్పు అని పేర్కొన్నారు. అంతేకాకుండా పదవి నుండి దిగిపోయిన తరువాత నిమ్మగడ్డ తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవుతారని కొడాలి నాని జోస్యం చెప్పారు.