ఇటీవల జగన్ సర్కార్ తలపెట్టిన ఇళ్ల పట్టాల కార్యక్రమం పట్ల రాష్ట్ర వ్యాప్తంగా భారీ స్పందన వస్తున్న సంగతి తెలిసిందే. దేశంలో ఏ రాష్ట్రంలో చేయని రీతిలో దాదాపు 30 లక్షల మంది పేదలకు మేలు చేసే విధంగా జగన్ తీసుకున్న ఈ నిర్ణయం పై చాలా మంది ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ముఖ్యంగా మహిళల పేరిట తలపెట్టిన ఈ కార్యక్రమానికి దేశంలో ఉన్న ప్రముఖ మహిళలు జగన్ సర్కార్ ని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.
ఇటువంటి తరుణంలో ఇళ్ల పట్టాల విషయంలో కృష్ణాజిల్లాలో సొంత పార్టీ కార్యకర్తలు జిల్లా పార్టీ అధినాయకత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ సీఎం జగన్ ఫ్లెక్సీలు తగలబెట్టడం సంచలనంగా మారింది. విషయంలోకి వెళితే మైలవరం మండలం, పొందుగల గ్రామంలో అర్హులైన వారికి ఇళ్ల పట్టాలు ఇవ్వకుండా అనర్హులకు ఇళ్ల పట్టాలు ఇచ్చారు అంటూ వైసీపీ కార్యకర్తలు జిల్లా నేతలపై మండిపడ్డారు.
ముఖ్యంగా ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ఎన్నికల సమయంలో ఒకలా వ్యవహరించి తర్వాత స్వప్రయోజనం తీసుకుంటున్నారని ఈసారి ఓట్ల కోసం గ్రామంలో అడుగుపెడితే ఊరుకునే ప్రసక్తి లేదు అంటూ పొందుగల గ్రామ ప్రజలు హెచ్చరించారు. ఈ నేపథ్యంలో గ్రామంలో ఉన్న పార్టీ కార్యకర్తలు వైసీపీ పార్టీకి చెందిన జెండాలు అదేవిధంగా క్యాలెండర్లు జగన్ ఫ్లెక్సీలను తగలబెట్టారు. అంత మాత్రమే కాక ఎన్నికల సమయంలో ప్రచారం చేసే తరుణంలో వసంత కృష్ణ ప్రసాద్ గ్రామ ప్రజలకు అందించిన గడియారాలను కూడా పగలగొట్టడం జరిగింది.