తెలుగు రాష్ట్రాల్లో ఉత్కంఠను రేకెత్తించిన దుబ్బాక ఉప ఎన్నికల ఫలితాలు వచ్చేశాయి. ప్రతి రౌండ్లో ఉత్కంఠను రేకెత్తించిన ఈ పోరులో బీజేపీ గెలుపొందింది. మొదటి రౌండ్ నుంచి బీజేపీ లీడింగ్ కొనసాగిస్తూ వస్తోంది.
అయితే మధ్యలో ట్విస్టులు నెలకొన్నాయి. చివరికి కాషాయ పార్టీ దుబ్బాకలో జెండా ఎగురవేసింది. అయితే, ఈ సందర్భంగా బీజేపీ మిత్రపక్ష నేత , సినీ నటుడు పవన్ కళ్యాణ్ విడుదల చేసిన ప్రకటన చర్చకు తెరలేపింది.
ట్విస్టులే ట్విస్టులు
దుబ్బాకలో బీజేపీ 1118 ఓట్ల మెజారిటీతో తెరాస పార్టీపై విజయం సాధించింది. దుబ్బాకలో విజయం సాధించడంతో బీజేపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. సహజంగానే అధికార టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు నారాజ్గా ఉన్నాయి. ఇలాంటి సమయంలో పవన్ కళ్యాణ్ కీలక ప్రకటన విడుదల చేశారు. బీజేపీకి శుభాకాంక్షలు తెలిపారు.
పవన్ ఏమంటున్నారంటే…
దుబ్బాకలో విజయం సాధించిన భారతీయ జనతా పార్టీ అభ్యర్థి రఘునందన్ రావుకు, బీజేపీ తెలంగాణ రాష్ట్ర నాయకత్వానికి శుభాబినందనలు తెలుపుతున్నాను, బీజేపీ , ఆ పార్టీ నాయకత్వంపై ప్రజల విశ్వాసానికి నిదర్శనం దుబ్బాకలో ఈ విజయంగా భావిస్తున్నాను అని పవన్ కళ్యాణ్ ప్రకటన విడుదల చేశారు. బీజేపీ తెలంగాణ శాఖ నాయకత్వ పగ్గాలు స్వీకరించిన నాటి నుంచి నేటి దుబ్బాక ఉప ఎన్నికల వరకు బండి సంజయ్ చూపిన నాయకత్వ పటిమ నేటి విజయానికి మార్గం వేసింది అంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిపై ప్రశంసలు కురిపించారు. పార్టీలోని అన్ని వర్గాలను సమాయత్తం చేసి ఆయన ఈ విజయాన్ని సాధించారు అంటూ పవన్ కళ్యాణ్ విశ్లేషించారు.
రఘునందన్ రావును సైతం…
ఈ సందర్భంగా ఎమ్మెల్యేగా గెలుపొందిన రఘునందన్ రావుపై సైతం పవన్ కళ్యాణ్ ప్రశంసలు కురింపించారు. రఘునందన్ రావు వ్యక్తిత్వం, ప్రజా సేవలో చూపే నిబద్దత ఆయనకు విజయ హారాన్ని అందించింది అంటూ పవన్ కళ్యాణ్ విశ్లేషించారు. రాజకీయాలను సక్రమ మార్గంలో నడిపించడం యువత వల్లే సాధ్యమవుతుందని తాను విశ్వసిస్తానని జనసేనాని పేర్కొన్నారు. దుబ్బాక ఎన్నికలో యువకులు విశేష సంఖ్యలో పాల్గొనడం ఒక శుభపరిణామన్న ఆయన దుబ్బాక విజయంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికీ పేరు పేరున అభినందనలు తెలుపుతున్నానని వెల్లడించారు. పవన్ కళ్యాణ్ పత్రిక ప్రకటనపై టీఆర్ఎస్ శ్రేణులు ఏ విధంగా స్పందిస్తాయో మరి.