కోవిద్-19 వ్యాప్తి దేశాన్ని గజగజలాడిస్తుంది. ఈ మహమ్మారి పరిస్థితిపై చర్చించేందుకు గాను ప్రధాని నరేంద్ర మోదీ అఖిలపక్ష సమావేశం నిర్వహించనున్నట్లు సమాచారం. మోదీ, ఆల్ పార్టీ మిటింగ్ నిర్వహించడం ఇది రెండో సారి. డిసెంబర్ 4 (శుక్రవారం)న వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ కార్యక్రమం జరుగనుంది. శుక్రవారం ఉదయం 10:30 నిమిషాలకు జరగబోయే ఈ సమావేశానికి రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, హోం మినిస్టర్ అమిత్ షా, ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి, పార్లమెంటు ఉభయ సభల్లోనూ ఆయా పార్టీలకు చెందిన పార్లమెంటరీ పక్ష నేతలు సమావేశానికి హాజరు కానున్నట్లు తెలిసింది. ఇప్పటికే పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అన్ని పార్టీ నాయకులను సంప్రదించినట్లు సమాచారం. దేశ రాజధాని ఢిల్లీలో కరోనా వ్యాప్తి ఎక్కువుగా ఉన్న వేళ పార్లమెంట్ శీతాకాల సమావేశాలను బడ్జెట్ సమావేశాలతో కలిపి నిర్వహించాలని కేంద్రం యోచిస్తున్న తరుణంలో ఈ అఖిలపక్ష సమావేశం జరుగనుంది.
ఇక కోవిడ్ కేసుల్లో ప్రపంచంలో అమెరికా ప్రథమ స్థానంలో ఉండగా.. భారత్ రెండో స్థానంలో కొనసాగుతోంది. అయితే అమెరికాతో పోలిస్తే ఇండియాలో కోవిడ్ మరణాలు చాలా తక్కువగా నమోదయ్యాయి. భారతదేశంలో 24 గంటల వ్యవధిలో 40,000 కన్నా తక్కువగా కోవిద్ -19 కేసులు నమోదయ్యాయి. ఈ నెలలో కేసుల సంఖ్య తగ్గడం ఇది ఏడవ సారి. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 94 లక్షలకు మందికి పైగా కరోనా వైరస్ బారిన పడ్డారు. అయితే కరోనా నుండి రికవరీ కేసులు సంఖ్యా 88,47,600 కు పెరిగింది. కొత్తగా 38,772 కరోనా వైరస్ కేసులు నమోదు అయ్యాయి. గడిచిన 24 గంటలలో 443 మరణాలు సంభవించిగా, మరణించిన వారి సంఖ్య 1,37,139 కు చేరుకుంది.