ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ వారు వైసీపీని ఎదుర్కోవడానికి ఎన్నో మతపరమైన ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. వారికి అవి ఎంత మాత్రం రాజకీయ లబ్ది చేకూరుస్తున్నాయో తెలియదు కానీ…. ఇదే ఊపులో వారు చేస్తున్న మరిన్ని ఆరోపణలు మాత్రం కొంతమందికి విపరీతమైన చిరాకుని తెప్పిస్తున్నాయి. ఏపీ పోలీసు అధికారుల సంఘం… ఒక ఎస్సై ఆత్మహత్య విషయాన్ని టీడీపీ నేతలు రాజకీయ లబ్ధి కోసం వాడుతున్న తీరుపై విపరీతంగా విరుచుకుపడ్డారు.
పెళ్ళైన రెండు నెలలకే
వివరాల్లోకి వెళితే… గుడివాడ టూ టౌన్ ఎస్ ఐ విజయ్ కుమార్ ఆత్మహత్య చేసుకున్నారు. అతను నివాసం ఉండే అపార్ట్ మెంట్ లోనే ఉరి వేసుకుని చనిపోయారు. ఈఎస్ఐ కి రెండు నెలల క్రితమే పెళ్లయింది. అయితే భార్యను కాపురానికి తీసుకు రాలేదు అని తెలుస్తోంది. ఆమె ఇంటికి వచ్చే లోపలే విజయ్ కుమార్ ఆత్మహత్య చేసుకోవడం నగర వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. ప్రస్తుతం ఈ కేసు పోలీసుల విచారణలో ఉంది. అయితే విజయవాడలో ఇదే విషయమై మీడియా సమావేశం నిర్వహించిన పోలీసు అధికారుల సంఘం టిడిపి నేతల తీరుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
దానికీ దీనికీ లింక్
పేకాట శిబిరాలపై దాడి చేసిన కారణంగానే ఎస్సై పైన వచ్చిన ఒత్తిడి తట్టుకోలేక అతను ఆత్మహత్య చేసుకున్నాడని టిడిపి నేతలు చేస్తున్న ప్రచారాన్ని అవాస్తవమని తేల్చిచెప్పారు. కావాలని తమ రాజకీయ లబ్ధి కోసం కేసును తప్పుదోవ పట్టిస్తున్నారని పోలీసు అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జనకుల శ్రీనివాసరావు తెలిపారు. తన ఈనెల సర్వీసులో రాష్ట్రంలో ఇంత దిగజారుడు రాజకీయాలను తాను మునుపెన్నడూ చూడలేదు అని మండిపడ్డారు. ఎస్సై ఆత్మహత్య కేసు ప్రాథమిక విచారణలో ఉందని దర్యాప్తు ద్వారా అసలు వాస్తవాలు వెలుగులోకి వస్తాయి కానీ ఇలా టీడీపీ నేతలు కేసుని ఇప్పటినుండి తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు మానుకోవాలని అన్నారు.
పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు సహించం..!
ఈ ఆత్మహత్యపై అవాస్తవాలు ప్రచారం చేసే వ్యక్తుల పై న్యాయ పోరాటం చేసేందుకు పోలీసు సంఘం మొత్తం సిద్ధంగా ఉందని తెలిపారు. శ్రీనివాసరావు మాట్లాడుతూ ఏకంగా టిడిపి అధినేత చంద్రబాబు ఎస్సై ఆత్మహత్యకు రాజకీయ కారణాలను ఆపాదించడం చాలా దారుణమని అన్నారు. వెంటనే వారు చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇక అచ్చెన్నాయుడు పోలీసు వారిని బెదిరించడం కూడా తాము తీవ్రంగా ఖండిస్తున్నామని…. ఇలాంటి పనులు చేసే నేతలందరినీ ఇకపై తీవ్రంగా పరిగణిస్తామని ఆయన అన్నారు. పోలీసు వ్యవస్థపై తమ ఇష్టం వచ్చినట్లు అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని చెప్పారు.