ఢిల్లీ: రఫేల్ ఒప్పంద వివాదంలో గతంలో ఇచ్చిన తీర్పును పునఃసమీక్షించాలంటూ దాఖలైన పిటిషన్లపై నాలుగు రోజుల్లో తమ స్పందన తెలియజేయాలని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. పిటిషన్లకు సమాధానం చెప్పేందుకు నాలుగు వారాల గడువు కావాలంటూ అటార్నీ జనరల్ కెకె వేణుగోపాల్ కోరినప్పటికీ కోర్టు అందుకు నిరాకరించింది. మే నాలుగు లోగానే సమాధానం చెప్పాలంటూ కేంద్రానికి ధర్మాసనం ఆదేశించింది. తదుపరి విచారణను మే ఆరుకు వాయిదా వేసింది.
రఫేల్ ఒప్పందంలో అవతవకలేమీ జరగలేదని గతంలో ఇచ్చిన తీర్పును సమీక్షించడంపై కేంద్ర ప్రభుత్వ అభ్యంతరాలను సుప్రీం కోర్టు తోసిపుచ్చిన విషయం తెలిసిందే. రఫేల్ ఒప్పందానికి సంబంధించిన కొన్ని కీలక పత్రాలు బహిర్గతమయ్యాయి. వీటిని ఒక ప్రముఖ ఆంగ్ల పత్రిక ప్రచురించింది. వాటి ఆధారంగా పిటిషనర్లు కోర్టును ఆశ్రయించారు. ఈ పత్రాల ప్రాతిపదికన సమీక్ష జరపాలని కోరారు.
అయితే దీనిపై కేంద్రం అభ్యంతరం వ్యక్తం చేసింది. రక్షణశాఖ నుంచి ఆ పత్రాలను దొంగిలించి వాటి నకలును కోర్టుకు ఇచ్చారని పేర్కొంది. అక్రమ మార్గంలో తీసుకొచ్చిన పత్రాల ఆధారంగా తీర్పును సమీక్షించడం సరికాదని వాదించింది. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు కేంద్ర ప్రభుత్వ అభ్యంతరాలను కొట్టివేసింది. లీకైన పత్రాలతో ఇబ్బందేమీ లేదని, వాటి ఆధారంగా పునఃసమీక్ష జరిపేందుకు కోర్టు అంగీకరించింది.
అయితే ఈ పిటిషన్లపై కేంద్రానికి అధికారికంగా ఇంకా నోటీసులు రాలేదనీ, అందుకే ప్రమాణపత్రం దాఖలు చేసేందుకు నాలుగు వారాల గడువు కావాలనీ అటార్నీ జనరల్ కెకె వేణుగోపాల్ న్యాయస్థానాన్ని కోరారు. ఇందుకు చీఫ్జస్టిస్ రంజన్ గొగొయ్ నేతృత్వంలోని ధర్మాసనం తిరస్కరించింది.