కర్నూలు: నంద్యాల పార్లమెంట్ జనసేన అభ్యర్ధి, సిట్టింగ్ ఎంపి ఎస్పివై రెడ్డి మంగళవారం తుదిశ్వస విడిచారు. అనారోగ్యం కారణంగా కొద్ది రోజులుగా హైదరాబాదులో ఒక కార్పోరేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రెడ్డి మంగళవారం రాత్రి మృతి చెందారు.
2004, 2009 ఎన్నికల్లో నంద్యాల లోక్ సభ కాంగ్రెస్ ఆభ్యర్ధిగా విజయం సాధించిన ఎస్పివై రెడ్డి రాష్ట్ర విభజన అనంతరం 2014లో వైసిపి నుండి పోటీ చేసి గెలిచి హాట్రిక్ సాధించారు. మూడవ సారి ఎంపిగా గెలిచిన కొద్ది నెలలకే వైసిపిని వీడి అధికార తెలుగుదేశంలో చేరారు.
ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఆయన అభ్యర్ధిత్వం ఖరారు చేయకపోవడంతో గత నెలలో జనసేన పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వెంటనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నంద్యాల పార్లమెంట్ అభ్యర్ధిత్వం ఖరారు చేశారు. జనసేన ఆభ్యర్ధిగా నామినేషన్ దాఖలు చేసిన ఎస్పివై రెడ్డి ముమ్మరంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ ఈ నెల మూడవ తేదీన అస్వస్ధతకు గురయ్యారు. అప్పటి నుండి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం తుదిశ్వాస విడిచారు.
ఎస్పివై రెడ్డి మృతికి సిఎం చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో సహ పలువురు ప్రముఖులు, రాజకీయ పార్టీల నేతలు సంతాపం తెలియజేశారు.