చెప్పులోని రాయి, చెవులోని జోరీగ, కంటిలోని నలుసు, కాలి ముళ్లు, రేవంత్ పోరు ఇంతింత కాదయా… ప్రస్తుతం కేసీఆర్ ఈ పద్యాన్ని పాడుకోవాల్సిన పరిస్థితి రేవంత్ రెడ్డి కల్పించాడన్న అతిశయోక్తి కాదేమో! ప్రస్తుతం రాజకీయంగా ఎలాంటి ఇబ్బందీ లేకుండా దూసుకుపోతున్న కేసీఆర్ కు నిజంగానే రేవం చాలా ఇబ్బందిగా తయారయ్యారని అంటున్నారు విశ్లేషకులు. ఉదాహరణకు మొన్న జరిగిన ఈట్ల రాజేందర్ వ్యవహారమే చూసుకుంటే గనుక… రేవంత్ పేల్చిన బాంబు కొత్త అనుమానాలకు తావిస్తోందనే చెప్పాలి.
కరోనా విషయంలో కేసీఆర్ సర్కార్ ఫెయిల్యూర్స్ కి ఈటల ను బలిపశువును చేయబోతున్నారని, ఆయనని కేబినెట్ నుంచి తొలగించడానికి కేసీఆర్ కరోనాను వాడుకుంటున్నారని చెప్పిన రేవంత్… ఆ విషయం తనకు టీఆర్ ఎస్ కు చెందిన మిత్రుడే చెప్పారని పెద్ద బాంబే పేల్చారు. దీంతో తెరాస అధినాయకత్వం ఒక్కసారిగా ఉలిక్కిపడిందనే చెప్పొచ్చు. ఆ సంగతి అలా ఉంటే… మరో విషయంలో కూడా కేసీఆర్ కు వరుస షాక్ ఇచ్చారు రేవంత్.
కోరోనా వచ్చిన మొదట్లో కేసీఆర్ ఒక సంచలన ప్రకటన చేశాడు. హైదరాబాదుకు చుట్టు ఒక్కో ఆస్పత్రిని ఘనంగా నిర్మించుకుందాం. గచ్చిబౌలిలో టిమ్స్ ఆస్పత్రి ఏర్పాటు చేస్తాం అని ప్రకటించారు. ఏప్రిల్ లో దీన్ని ప్రారంభం కూడా చేశారు. పది వేల కేసులు వచ్చినా తట్టుకునే స్థితిలో తెలంగాణ ప్రభుత్వం ఉందని.. ఆందోళన చెందాల్సిన పనిలేదని ఈ సందర్భంగా కేసీఆర్ ఘనంగా ప్రకటించారు. ఈ క్రమంలో కరోనా తీవ్రత పెరగటం.. గాంధీలో పేషెంట్లు నిండిపోవడంతో నిమ్స్ ను కోవిడ్ ఆస్పత్రిగా మార్చడంతో… “టిమ్స్” ఏమైందని చాలామందిలో అనుమానం వచ్చింది. ఈక్రమంలోనే ఎంపీ రేవంత్ రెడ్డి టిమ్స్ ను ఆకస్మికంగా సందర్శించారు.
అనంతరం స్పందించిన రేవంత్… “అక్కడ ఎటువంటి ఆస్పత్రి సదుపాయాలు లేవు.. నలుగురు సెక్యూరిటీ మాత్రమే ఉన్నారు.. ఇదీ మన ముఖ్యమంత్రి మాటల గారడీ.. ఆయనలో గొప్పలు చెప్పుకోవడం తప్ప ఏమీ ఉండదు. టిమ్స్ గురించి అంత గొప్పగా చెప్పాడు? చివరకు నిమ్స్ మీద ఆధారపడ్డారు.. అంత ఘనంగా ప్రచారం చేసుకుని మీడియాలో రాయించుకున్నాడు… ఈ ఆస్పత్రికి కనీసం డ్రైనేజీ కూడా లేదు” అని ఫైరయ్యారు. వెంటనే… టిమ్స్ ఆస్పత్రిలో సిబ్బంది నియామకానికి నోటిఫికేషన్ విడుదల చేసింది తెలంగాణ సర్కార్. ఇప్పుడు దీనిపైనే అటు రాజకీయ వర్గాల్లో, ఇటు సోషల్ మీడియా మాధ్యమాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది.
రేవంత్ పర్యటించారు, వాస్తవాలు బయటపెట్టారు కాబట్టి… టిమ్స్ విషయంలో ప్రభుత్వం స్పందించి, నియామకానికి నోటిఫికేషన్ విడలచేసిందా..? లేక ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేయబోతోందని ముందే తెలిసి రేవంత్ ఆ ఆస్పత్రిని సందర్శించడానికి వెళ్లారా? అని! రెండింటిలో ఏది జరిగినా ఆ క్రెడిట్ రేవంత్ కే అనే మాటలు బలంగా వినిపిస్తున్నాయి. అంటే… రేవంత్ కు కేసీఆర్ టీం లో కోవర్టులు ఉన్నారా అని! కేసీఆర్ సొంత టీం లోకే రేవంత్.. సీక్రెట్ మిస్సైల్స్ ని పంపి సూపర్ డూపర్ ప్లాన్ చేశారా అని! ఏది ఏమైనా… రేవంత్ మాత్రం కేసీఆర్ కు కంటిలోని నలుసుగా మారరనడంలో ఎలాంటీ సందేహం అక్కరలేదేమో అని అభిప్రాయాలకు బలం చేకూరుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు!