మంగళగిరిలో గత ఎన్నికల్లో రకరకాల ఈక్వేషన్లతో పాటు అస్త్రశస్తాలు వాడి జగన్ లోకేష్ను ఓడించే ప్రయత్నం చేశారు. చివరకు లోకేష్ను ఓడిస్తే.. ఆయనపై గెలిచిన ఆర్కేకు మంత్రి పదవి ఇస్తానని అక్కడ ప్రజలకు భ్రమలు కల్పించారు. లోకేష్ను మంగళగిరి ప్రజలు ఓడించినా జగన్ ఆర్కేకు మంత్రి పదవి ఇవ్వలేదు.. చివరకు ఆయన చేసిన పనులకు బిల్లులు కూడా ఇవ్వలేదు. ఆర్కే జగన్కు గుడ్ బై చెప్పి కాంగ్రెస్లో చేరి తిరిగి వైసీపీ గూటికి వచ్చారు.
ఈ లోగా మంగళగిరి వైసీపీలో చాలా మంది మార్పులు జరిగాయి. ఆర్కేను బయటకు పంపాక గంజి చిరంజీవికి నియోజకవర్గ పగ్గాలు ఇచ్చారు. ఆయన్ను పక్కన పెట్టేసి మాజీ మంత్రి మురుగుడు హనుమంతరావు కోడలు, ఇటు మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల కూతురు అయిన మురుగుడు లావణ్యను కొత్త ఇన్చార్జ్గా నియమించారు. ఇటు రెండు బలమైన కుటుంబాల నుంచి రావడం.. రెండు కుటుంబాలకు రాజకీయ నేపథ్యం ఉండడంతో పాటు పద్మశాలీ సామాజిక వర్గం కావడంతో ఈ సారి కూడా లోకేష్ను ఓడించాలని జగన్ ఎత్తులు పై ఎత్తులు వేస్తున్నారు.
జగన్ ఎత్తులు ఎలా ఉన్నా ఈ సారి మంగళగిరిలో వైసీపీకి అంత సానుకూల వాతావరణం లేదు. జగన్, వైసీపీకి వ్యతిరేకంగా అక్కడ రెడ్లు అందరూ ఏకమవుతున్నారు. మంగళగిరి, తాడేపల్లి, దుగ్గిరాల మండలాల్లోని రెడ్డి సామాజిక వర్గ ప్రముఖులు ఒకతాటి పైకి వచ్చి నారా లోకేష్ ను గెలిపించుకునేందుకు అడుగులు వేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వంపై నియోజకవర్గ రెడ్డి సామాజిక వర్గం తీవ్ర అసంతృప్తిగా ఉంది. జగన్ను సీఎం చేసేందుకు మధ్యతరగతి రెడ్లలో కూడా చాలా మంది తమ వ్యాపారాలు, పనులు పక్కన పెట్టి ఆర్థికంగా చందాలు వేసుకుని మరీ మంగళగిరిలో కసితో వైసీపీని గెలిపించి.. లోకేష్ను ఓడగొట్టారు.
అయితే ఇప్పుడు వీరికి వైసీపీ ప్రభుత్వంలో ఒరిగింది ఏమీలేదు. పైగా అమరావతి రాజధాని అంటూ మభ్య పెట్టారని రాజధాని ప్రాంత రెడ్లు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. రాజధాని మార్పు వల్ల తాము ఆర్థికంగా చాలా నష్టపోయామని ఇప్పుడు లబోదిబోమంటున్నారు. ఇక యూ- వన్ జోన్ తొలగిస్తామని మోసం చేసిందని రెడ్డి సమాజిక వర్గ రైతుల అసహనం వ్యక్తం చేస్తున్నారు. మా వాడు మా వాడుఅని తాము ఎంతో ఎత్తుకు ఎగెరెగిరి పడ్డామని ఇప్పుడు మమ్మలను కూడా వదలకుండా ముంచేశారని వారు వాపోతున్నారు.
ఇక మంగళగిరి నియోజకవర్గంలో రెడ్లు ఎక్కువుగా ఉండే తాడేపల్లి నుంచి నారా లోకేష్ కు మద్దతు పలుకుతూ పలువురు రెడ్డి సామాజిక వర్గ ప్రముఖులు లోకేష్ సమక్షంలో టీడీపీలో చేరారు. రాజధాని ఇక్కడే ఉంటే భావి తరాలు బాగుంటాయని, రాజధాని ఇక్కడే ఉండాలంటే టీడిపి గెలిపించుకోవాలని రెడ్డి సామాజిక వర్గ నేతలు అభిప్రాయపడుతున్నారు. ఇక పార్టీ మారని వారు కూడా ఎన్నికల టైంకు వైసీపీకి, జగన్కు తామేంటో చుక్కలు చూపిస్తామని.. వైసీపీని చిత్తుగా ఓడిస్తామని శపథాలు చేస్తున్నారు.