RRR Episode : పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్న ఎంపీలపై అనర్హత వేటు వేయాలంటూ వైసీపీ, టీఎంసీ చేసిన పిర్యాదులపై లోక్ సభ స్పీకర్ స్పందించారు. నర్సాపురం వైసీపీ ఎంపి రఘురామకృష్ణం రాజుపై చర్యలు తీసుకోవాలని ఆ పార్టీ పార్లమెంటరీ నేతలు ఏడాది క్రితం ఫిర్యాదు చేసినా ఇంత వరకూ చర్యలకు ఉపక్రమించలేదు. అయితే ఇటీవల తాజాగా మరో మారు వైసీపీ పార్లమెంటరీ నేతలు విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డి లు లోక్ సభ స్పీకర్ ఓంబిర్లాను కలిసి రఘురామపై బలమైన ఆధారాలతో ఫిర్యాదు అందజేశారు. ఈ అంశంపై ఇటీవల స్పందించిన స్పీకర్ ఇరుపక్షాల వాదనల విన్న అనంతరం చర్యలు తీసుకుంటామని తెలిపారు.
Read More: Nizamabad: నిజామాబాద్ జిల్లాలో రాజకీయ కుటుంబ కథా చిత్రం..! జిల్లాలో ఇదే హాట్ టాపిక్..!!
ఈ నేపథ్యంలో పార్టీ వ్యతిరేక కార్యకలాపాల పిర్యాదులపై ముగ్గురు ఎంపీలకు లోక్ సభ సచివాలయం నేడు నోటీసులు జారీ చేసింది. వైసీపీ ఎంపి రఘురామ కృష్ణం రాజు, టీఎంసీ ఎంపిలు సిసిర్ అధికారి, సునీల్ కుమార్ లకు నోటీసులు జారీ అయ్యాయి. ఎంపిలు సిసిర్ అధికారి సునీల్ కుమార్ పై తృణమూల్ కాంగ్రెస్ ఫిర్యాదు చేసిన నేపథ్యంలో రఘురామ కృష్ణంరాజుతో సహా వీరిద్దరికి నోటీసులు జారీ అయ్యాయి. 15 రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నట్లు సమాచారం. ఈ నెల 19వ తేదీ నుండి పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో ముగ్గురు ఎంపీలకు నోటీసులు జారీ చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. రఘురామ కృష్ణంరాజుపై చర్యలు తీసుకోకపోతే పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ఆందోళన చేస్తామని కూడా వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి హెచ్చరించిన సంగతి తెలిసిందే.