Russia-Ukraine War: క్రిమియా ద్వీపకల్పానికి జీవనాడి వంటి కెర్చ్ వంతెనపై ట్రక్ బాంబు పేలుడు తర్వాత ఉక్రెయిన్ పై రష్యా తీవ్రంగా రెచ్చిపోయింది. శనివారం ఉక్రెయిన్ లోని జపోరిజియా నగరంలో పౌరుల నివాసాలపైకి క్షిపణులు, రాకెట్లతో విరుచుకుపడిన రష్యా .. తాజాగా సోమవారం రాజధాని కైవ్ సహా అనేక నగరాలపై దాడులను కొనసాగించింది. శనివారం రాత్రంతా కొనసాగిన దాడుల్లో 12 మంది పౌరులు మృతి చెందగా 60 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. ఒక బహుళ అంతస్తుల భవనం పూర్తిగా నేలమట్టమైంది, కనీసంగా 50 భారీ అపార్ట్ మెంట్లు, 20 ఇళ్లు ధ్వంసం అయ్యాయి. ఉక్రెయిన్ సైన్యం కూడా ఈ దాడులను నిర్ధారించింది. పౌరుల నివాసాలను రష్యా టార్గెట్ గా చేసుకోవడాన్ని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ తీవ్రంగా తప్పుబట్టారు.
కెర్చ్ వంతెనపై ట్రక్ బాంబు పేల్చివేతను ఉగ్రవాద చర్యగా అభివర్ణించిన రష్యా అధ్యక్షుడు పుతిన్.. ఉక్రెయిన్ కు చెందిన ప్రత్యేక దళాలు ఈ చర్యకు పాల్పడి ఉంటాయని ఆదివారం ఆరోపించారు. మరో పక్క కెర్చ్ వంతెన వద్ద భద్రతను కట్టుదిట్టం చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. రైలు వంతెనపై క్రిమియా ద్వీపకల్పానికి, రష్యా భూభాగాలకు ప్రయాణీకుల రైళ్ల రాకపోకలను పునరుద్దరించారు. రోడ్డు వంతెన పై నున్న మరో మార్గంలో వాహనాలను అనుమతిస్తున్నట్లు రష్యా రవాణా శాఖ వెల్లడించింది. తాజాగా రాజధాని కైవ్ లోని అనే ప్రాంతాలతో పాటు ఎల్వివ్, జైటోమిర్, ఖ్మెల్నిట్స్కీ, డ్నిప్రో, టెర్నోపిల్ నగరాల్లో పేలుళ్లు సంభవించాయి. కైవ్ నగరంలోని జెలెన్ స్కీ కార్యాలయంపైనా మిసైల్ దాడి జరిగినట్లు వార్తలు వచ్చాయి. ఈ దాడిలో ముగ్గురు మృతి చెందగా పలువురు గాయపడినట్లు సమాచారం. దేశంలో అనేక నగరాల్లో పేలుళ్లు నమోదు అయ్యాయని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ తెలిపారు. క్షిపణులు, రాకెట్ల దాడుల్లో అనేక మంది మృత్యువాత పడ్డారని, చాలా మంది గాయపడ్డారని ఆయన పేర్కొన్నారు.