సౌదీ అరేబియా దేశం పాకిస్థాన్కు షాకిచ్చింది. పాక్కు చమురు సరఫరాను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. కాశ్మీర్ వివాదంపై పాక్ అనుసరిస్తున్న వైఖరికి ఆగ్రహించడం వల్ల సౌదీ అరేబియా ఆ విధంగా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు పాకిస్థాన్ విదేశీ వ్యవహారాల మంత్రి మహమ్మద్ ఖురేషీ చేసిన వ్యాఖ్యల వల్ల కూడా సౌదీ అరేబియా ఆగ్రహించి ఈ నిర్ణయం తీసుకుంది.
గతంలో ఖురేషీ.. కాశ్మీర్ విషయంలో ఇతర ముస్లిం దేశాలు మాకు మద్ధతుగా ఉన్నాయి, కనుక మీరు కూడా మద్దతు ఇవ్వాలి, లేకపోతే ఇస్లామిక్ దేశాల సమావేశానికి పిలుపునివ్వాలని పాక్ ప్రధాని ఇమ్రాన్ను నేను కోరుతా.. అంటూ వ్యాఖ్యలు చేశారు. దీనికి సౌదీ అరేబియా ఆగ్రహించినట్లు తెలుస్తోంది. అందుకనే ఆ దేశం తాజాగా పాక్కు చమురు సరఫరాను నిలిపివేసింది. ఇక గతంలో పాక్కు ఇచ్చిన 1 బిలియన్ డాలర్లను కూడా వెనక్కి ఇచ్చేయాలని సౌదీ అరేబియా ఆ దేశాన్ని డిమాండ్ చేసింది.
నవంబర్ 2018లో పాకిస్థాన్కు సౌదీ అరేబియా 6.2 బిలియన్ డాలర్ల ప్యాకేజీని ప్రకటించగా.. అందులో 3 బిలియన్ డాలర్లను రుణం రూపంలో పాక్ పొందింది. ఇక మిగిలిన మొత్తం చమురుకు చెందినది. ఇందుకు గాను గతేడాది ఫిబ్రవరిలో సౌదీ అరేబియా రాజు మహమ్మద్ బిన్ సల్మాన్ పాకిస్థాన్లో పర్యటించి అప్పట్లోనే ఆయా లావాదేవీలకు చెందిన పత్రాలపై సంతకాలు కూడా చేశారు. అయితే కాశ్మీర్ విషయంలో పాక్ భారత్కు వ్యతిరేకంగా ఉన్నందునే సౌదీ ఈ నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది.