ఏపీ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టిన షర్మిల.. అసలు వ్యూహాన్ని వదిలేసి.. అతి చేస్తున్నారనే టాక్ సొంత పార్టీలోనే వినిపిస్తుండడం గమనార్హం. రాష్ట్ర విభజనతో పార్టీ ఏపీలో తుడిచి పెట్టుకుపోయింది. దీంతో గత రెండు ఎన్నికల్లోనూ (2014, 2019) కాంగ్రెస్ పార్టీకి తరఫున ఒక్కరు కూడా విజయం దక్కించుకోలేక పోయారు. పైగా ఓటు బ్యాంకు 0.8 శాతానికి పడిపోయింది. ఈ నేపథ్యంలో పార్టీని పునరుజ్జీవింప చేయాలని కాంగ్రెస్ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నేపథ్యంలోనే వైఎస్ తనయగా షర్మిలకు ఏపీ పార్టీ బాధ్యతలు అప్పగించింది.
అంటే.. షర్మిల ప్రాధాన్యం తొలుత పార్టీపై ఉండాలి. పార్టీలోకి నేతలను ఆహ్వానించడం, సభ్యత్వం పెంచ డం వంటివాటిపై ఆమె దృష్టి పెట్టాల్సి ఉంటుంది. అదేసమయంలో పార్టీ నుంచి దూరమైన నాయకులతో చర్చించి.. వారిని తనవైపు తెచ్చుకుని.. పార్టీని ముందుకు నడిపించే వ్యూహాలకు పదును పెట్టాల్సి ఉంది. అయితే.. ఈ విషయాన్ని పక్కన పెట్టిన షర్మిల.. అత్యంత అప్రాధాన్యమైన ప్రభుత్వాన్ని టార్గెట్ చేసుకునే లక్ష్యాన్ని.. తన సొంత అజెండాను అమలు చేస్తున్నారనే వాదన వినిపిస్తోంది.
నిజానికి షర్మిల వచ్చిన తర్వాత.. (ఇప్పటికి 2 నెలలు అయింది) ఒక్కరంటే ఒక్కరు కూడా కీలక నాయకుడు ఆమె పక్షాన పార్టీలో చేరింది లేదు. అంతేకాదు.. వైసీపీ నుంచి వచ్చిన ఆళ్ల రామకృష్ణా రెడ్డి వంటివారిని కూడా నిలబెట్టుకోలేక పోయారు. ఇది భారీ అపశృతి. దీనిని సరిదిద్దుకుని.. తన లోపాలను సరిచేసుకోవాల్సిన షర్మిల.. కేవలం ప్రభుత్వంపై పోరాటానికే ప్రాధాన్యం ఇస్తున్నారనేది పార్టీలోనే జరుగుతున్న అంతర్గత చర్చ. కాంగ్రెస్ పార్టీకి పోరాటాలు కొత్తకాదు.
పైగా ప్రభుత్వంపై పోరాటాలు చేస్తే.. ప్రజల్లో సానుభూతి వస్తుందన్న ఆశలు కూడా ఆ పార్టీకి లేవు. ప్రజల పక్షాన కమ్యూనిస్టులు అనేక పోరాటాలు చేసినా.. వారి ఓటు బ్యాంకును ఎక్కడా పెంచుకోలేక పోయారు. ముందు పార్టీ నాయకత్వాన్ని పెంచుకుంటే.. ఆటోమేటిక్గా పార్టీ బలపడుతుంది. తద్వారా.. ప్రజా పోరాటాలుచేసుకుని ప్రజల్లో విశ్వసనీయతను పెంచుకునే అవకాశం ఉంటుంది.
ఇది వదిలేసిన షర్మిల.. ఏదో ఒక కారణాన్ని, నిర్ణయాన్ని చూపించి.. తన సొంత అజెండా అమలు చేస్తున్నారని.. పార్టీ వర్గాలు కినుక వహిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే సీనియర్లు సాకే శైలజానాథ్ వంటి వారు కూడా.. పార్టీకి దూరంగా ఉంటున్నారని అంటున్నారు. షర్మిల రాకతో.. ఇపప్పటి వరకు ఒనగూరిన లబ్ధి ఏమీ లేదని కూడా చెబుతున్నారు.