వైసీపీ నుంచివచ్చి.. తిరిగి వైసీపీలోకి వెళ్లిపోయేందుకు ప్రయత్నించిన కీలక నేత విషయంలో టీడీపీ హు టాహుటిన స్పందించింది. సత్వర చర్యలు చేపట్టింది. దీంతో సదరు నాయకుడు వెనక్కి తగ్గారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే జలీల్ఖాన్.. వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన విషయం తెలిసిందే. గత ఎన్నికల్లో టీడీపీ తరఫున ఆయన కుమార్తెకు టికెట్ ఇప్పించుకున్నారు. అయితే, ఆమె ఓడిపోయారు. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో తనకు టికెట్ ఇవ్వాలని ఆయన కోరుతున్నారు.
అయితే.. పశ్చిమ టికెట్ను జనసేనకు కేటాయించే విషయంపై టీడీపీలో అంతర్మథనం సాగుతోంది. ఈ టికెట్ కోసం.. పార్టీ సీనియర్ నాయకుడు, ఉత్తరాంధ్ర జిల్లాల ఇంచార్జ్ బుద్ధా వెంకన్న కూడా పట్టుబడు తున్న విషయం తెలిసిందే. ఈయన ఏకంగా చంద్రబాబు పాదాలను(ఫ్లెక్సీ) రక్తం కడిగి సంచలనం సృష్టించారు. వచ్చే ఎన్నికల్లో తనే పోటీ చేస్తానని కూడా చెప్పారు. మరోవైపు.. తనకు టికెట్ ఇవ్వకపోతే.. ముస్లింలు ఉరేసుకుంటారని జలీల్ ఖాన్ సెగ పెంచారు.
అయినప్పటికీ.. టీడీపీ అధినేత చంద్రబాబు ఈ విషయాన్ని లైట్ తీసుకున్నారు. దీంతో బుధవారం రాత్రి నుంచి పశ్చిమ నియోజకవర్గం పరిణామాలు ఆసక్తికర మలుపు తిరిగేలా మారాయి. వైసీపీ కీలక నేత సాయిరెడ్డి టచ్లోకి జలీల్ఖాన్ వెళ్లిపోయారు. అయితే.. ఈ సమాచారం లీకై… టీడీపీ అధినేత చంద్రబాబు చెవిలో పడింది. ఆ వెంటనే అలెర్ట్ అయిన.. బాబు వెంటనే విజయవాడ పార్లమెంటు నియోజకవర్గం ఇంచార్జ్.. కేశినేని చిన్నిని రంగంలోకి దింపారు. ఆయన నేరుగా జలీల్ఖాన్తో అప్పటికప్పుడు భేటీ అయ్యారు.
అర్ధరాత్రి 2 గంటల వరకు ఇరువురి మధ్య చర్యలు జరిగాయి. టికెట్ సహా.. పలు అంశాలపై చర్చించిన ట్టు తెలిసింది. అయితే.. ఈ విషయాన్ని చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్తానని చిన్ని హామీ ఇచ్చారు. ఇదే సమయంలో చంద్రబాబు కూడా జలీల్ఖాన్కు ఫోన్ చేసి.. ఉండవల్లికి రావాలని.. అన్ని విషయాలూ చర్చించుకుందామని ఆహ్వానించారు. దీంతో శాంతించిన జలీల్ఖాన్.. ఉండవల్లికి వెళ్లేందుకు అంగీకరించారు. దీంతో పశ్చిమ నియోజకవర్గంలో ఏం జరుగుతుందోనన్న ఆసక్తి మరింత పెరిగింది.