తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇప్పుడు పొలిటికల్గా గట్టి సవాల్ దశను ఎదుర్కుంటున్న సంగతి తెలిసిందే.
ఓ వైపు గత ఎన్నికల్లో రికార్డు స్థాయిలో ఓటమి మరోవైపు ముఖ్య నేతలు పార్టీకి గుడ్ బై చెప్పేసి ఏపీలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ఇదే క్రమంలో తాజాగా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు దిమ్మతిరిగిపోయే షాకిస్తూ, విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ తాడేపల్లిలోని ముఖ్యమంత్రి నివాసంలో ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ మెహన్ రెడ్డిని కలిసి పార్టీలో చేరారు. అంతేకాకుండా, తనపై టీడీపీ అనర్హత పిటిషన్ వేస్తే ఎదుర్కొవడానికి సిద్దంగా ఉన్నానని ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ సంచలన ప్రకటన చేశారు. ఎన్నికలకు వెళ్లడానికి కూడా సిద్దమేనని ఆయన తేల్చిచెప్పారు. విశాఖలో పార్టీ బలోపేతం కోసం పని చేస్తానని వాసుపల్లి గణేష్ ప్రకటించారు. వచ్చే విశాఖ మేయర్ ఎన్నికల్లో నూరు శాతం సీట్లు గెలిపించుకునేలా కృషి చేసి జగన్ కు కానుకగా ఇస్తానని అన్నారు.
చక్రం తిప్పిన వల్లభనేని వంశీ
ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ సమక్షంలో ఎమ్మెల్యే గణేష్ వైసీపీలో చేరడంలో కీలక పాత్ర పోషించిన వారిలో టీడీపీ రెబల్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఒకరు. ఓ వైపు చంద్రబాబుకు షాకిచ్చి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మద్దతు ప్రకటించిన వల్లభనేని దానికి కొనసాగింపుగా టీడీపీ ఎమ్మెల్యేలు వైసీపీ గూటికి చేర్చడంలో కీలక పాత్ర పోషిస్తున్నారని పలువురు మండిపడుతున్నారు. ఇలాంటి తరుణంలో సదరు టీడీపీ నేతల బీపీ మరింత పెంచేలా తాజాగా వంశీ మరిన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. టీడీపీకి ఎన్టీఆర్ వ్యవస్థాపక అధ్యక్షులు అయితే…. చంద్రబాబు భూస్థాపిత అధ్యక్షుడని మండిపడ్డారు. ఇంతటితో ఆగకుండా చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ వల్లనే టీడీపీ 23 సీట్లకు పడిపోయిందని మండిపడ్డారు. లోకేష్ వల్లే ఇప్పటికే తెలంగాణలో టీడీపీ క్లోజ్ అయిపోయిందని,ఇక ఏపీ లోను మూత పడుతుందని అన్నారు.
చంద్రబాబు వయసుతో సహా
టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు 72 ఏళ్ళ వయస్సు అని పేర్కొన్న వంశీ ఆయన శాశ్వతంగా ఉండరని అన్నారు. అలానే లోకేష్ బరువుకు టీడీపీ మునిగిపోయిందని వ్యాఖ్యానించారు. మూతపడే పార్టీ లో ఉండాలని ఎమ్మెల్యేలు ఎందుకు అనుకుంటారు ? అని వంశీ ప్రశ్నించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మమ్మల్ని చేర్చుకోవడం లేదు… మేం ఇష్టపడి సంఘీభావం తెలిపామని వంశీ పేర్కొన్నారు. సీఎం
జగన్ అంగీకరిస్తే చాలా మంది టీడీపీ నుంచి వైసీపీలోకి వస్తారని వల్లభనేని వంశీ బాంబు పేల్చారు. ఇలా పార్టీ మారే వారు, టీడీపీ నుంచి వెళ్లిన వాళ్ళు ద్రోహులు అయితే, వారికి చంద్రబాబు అధ్యక్షుడు అని వంశీ మండిపడ్డారు.
బాబు గతంలో
ఉన్మాదులు, ఆంధ్ర ప్రదేశ్ లో ఆధార్ కార్డ్ లేని వారు మాత్రమే టీడీపీ లో ఉంటారని వల్లభనేని వంశీ ఆరోపించారు. ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పోలవరం ప్రాజెక్టు చూపించడానికి చంద్రబాబు 400 కోట్లు ఖర్చు చేశారని అన్నారు. తెలుగుదేశం పార్టీ ఎన్నికల గుర్తు రావడానికి జయప్రదంగా చంద్రబాబు చేసింది అందరికి తెలుసునని వల్లభనేని వంశీ అన్నారు.