తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాజకీయ చాణక్యం గురించి , ఆయన ఎత్తుగడల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అంతుచిక్కని వ్యూహాలకు గులాబీ దళపతి పెట్టింది పేరు. అదే విధంగా ఆయన్ను రాజకీయ ప్రత్యర్థులు సైతం టార్గెట్ చేస్తుంటారు.
ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో టీఆర్ఎస్, బీజేపీ , కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. తెలంగాణ సీఎం కేసీఆర్ హస్తిన పర్యటనపై రకరకాల పుకార్లు షికార్లు చేస్తున్నాయి. దానిపై బీజేపీ నేతలు స్పందిస్తూ , కేసీఆర్ అవినీతిని మొత్తం బటయకు తీసి జైలుకు పంపిస్తామంటూ హాట్ కామెంట్లు చేస్తున్నారు. అయితే, ఇందులో తాజాగా కీలక కామెంట్లు తెరమీదకు వచ్చాయి.
కేసీఆర్ పై సీబీఐ విచారణ ?
కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై స్పందించిన జీవన్ రెడ్డి కొంత అలస్యమైనా బీజేపీ నేతలు సీఎం కేసీఆర్ను గ్రహించినందుకు సంతోషమని కామెంట్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో రూ. 4657 కోట్లతో జీవో 346 ద్వారా రుణ సదుపాయం పొందితే… నామినేషన్ ద్వారా రూరల్ ఎలక్ట్రిసిటీ కార్పొరేషన్ పై ఇచ్చారని పేర్కొన్నారు. పనులను వెంటనే అపి వేయండి అని డిమాండ్ చేసిన జీవన్రెడ్డి… నిర్మాణం చేపట్టిన ప్రాజెక్ట్ కు అనుమతి ఉందా? లేదా? అని అప్పు ఇచ్చేటప్పుడు చూడాల్సింది లేదా? అని ప్రశ్నించారు. రెండు కేసుల్లో సీఎం కేసీఆర్ పై సీబీఐ విచారణ పెండింగ్లో ఉందని జీవన్రెడ్డి మరింత సంచలన వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్లో ఎన్ని కోట్ల అవినీతి జరిగింది..? కేసీఆర్ ఎన్ని దండాలు పెట్టినా ఆయన అవినీతిని బయటకు తీస్తామన్న మాటకు బీజేపీ నేతలు కట్టుబడి ఉండాలని డిమాండ్ చేశారు.
జగ్గారెడ్డి సంచలనం ….
మరోవైపు కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సైతం సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షాని కేసీఆర్ కలిసిన విషయంలో అనేక అనుమానాలు ఉన్నాయని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో లా అండ్ ప్రాబ్లం లేదు… నక్సలైట్ల సమస్య అసలే లేదని పేర్కొంటూ అలాంటప్పుడు ఎందుకు కలిశారని ప్రశ్నించారు. ప్రధానిని కేసీఆర్ కలిసిన తర్వాత బండి సంజయ్ ఢిల్లీకి పోవడానికి కారణం ఏంటి ? అని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ ని జైల్లో పెడతా అనడం ఏంటో చెప్పాలని ప్రశ్నించారు. “కేసీఆర్ ని జైల్లో పెడతా అంటున్న బండి సంజయ్ ఏదైనా డెడ్ లైన్ పెట్టుకున్నారా ? డెడ్ లైన్ పెట్టె దమ్ము సంజయ్ కి ఉందా? ఇప్పటికే 10 సార్లు ఇలాంటి స్టేట్మెంట్ ఇచ్చారు?“ అని కామెంట్ చేశారు. కేసీఆర్ ని బీజేపీ జైలుకు పంపదని… కేసీఆర్ జైల్ కి పోడని…రెండు పార్టీలు రాజకీయ డ్రామాలు వేస్తున్నాయని ఫైర్ అయ్యారు. బండి సంజయ్ ని ఢిల్లీకి పిలిచి మాట్లాడించడం వెనక బీజేపీ నాటకం ఉందని జగ్గారెడ్డి ఆరోపించారు. ఢిల్లీ బీజేపీ నాయకులు కేసీఆర్ తో విందులు..వినోదాలు చేస్తున్నారని.. హైదరాబాద్ బీజేపీ నాయకులు…కేసీఆర్ మధ్య చిందులు నడుస్తున్నాయని ఎద్దేవా చేశారు.