నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ముందు గురువారం విచారణకు హజరైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా సోనియాను అయిదుగురు అధికారుల బృందం మూడు గంటల పాటు విచారించింది. మొత్తం 20 ప్రశ్నలను అడిగినట్లు తెలుస్తొంది. ఆరోగ్య కారణాలతో ఆమె చేసిన ప్రత్యేక విజ్ఞప్తిని ఈడీ అధికారులు పరిగణలోకి తీసుకుని తొలి రోజు విచారణను త్వరగానే ముగించారు. అమె ఇంటికి వెళ్లేందుకు అనుమతిస్తూ మరల సోమవారం విచారణకు హజరుకావాలని సమన్లు జారీ చేశారు. ఈడీ కార్యాలయంలో సోనియాను విచారిస్తున్న సమయంలో కుమారుడు రాహుల్ గాంధీ, కుమార్తె ప్రియాంక గాంధీ వాద్రాలు అదే కార్యాలయంలోని వేరే గదిలో వేచి ఉన్నారు.
మరో పక్క సోనియా గాంధీకి మద్దతుగా నిరసన వ్యక్తం చేస్తున్న కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు శాంతియుత నిరసనలు నిర్వహించారు. ఢిల్లీలో ఆందోళనకారులు వాహనాన్ని తగులబెట్టారు. ఆందోళనకారులపై పోలీసులు టీయర్ గ్యాస్ ప్రయోగించారు. ఏపి, తెలంగాణలో కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు నిరసన కార్యక్రమాలను నిర్వహించారు. కేంద్రంలోని బీజేపీకి, మోడీ, షాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.