పణజి: గోవా మాజీ ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ కుమారులు రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నారు. ఈ విషయాన్ని తాజాగా ప్రకటించారు. తన తండ్రి వారసత్వాన్ని కొనసాగించడానికి రాష్ట్రానికి, దేశానికి నిబద్ధులై ఉండాలని నిర్ణయించుకున్నట్లు ఆయన కుమారులు ఉత్పల్, అభిజాత్ ఓ ప్రకటనలో తెలిపారు. లోక సభ ఎన్నికలు లేదా తమ తండ్రి మరణంతో ఖాళీ అయిన పణజి ఉప ఎన్నికలలో వాళ్లు పోటీచేసే అవకాశం ఉంది. తమ తండ్రి వారసత్వాన్ని కొనసాగించడం ద్వారా ఆయన జీవితాన్ని గౌరవిస్తామన్నారు. తమ తండ్రి ప్రతిరోజూ బలంతో, గట్టి ఆత్మవిశ్వాసంతో, దేశానికి.. రాష్ట్రానికి సేవ చేయాలన్న కోరికతో బతికారని చెప్పారు. చిట్టచివరి నిమిషం వరకు కూడా ఆయన రాష్ట్రానికి సంబంధించిన విషయాలే చూసుకున్నారని ఉత్పల్, అభిజాత్ అన్నారు.
తమ కుటుంబంలో అతి ముఖ్యమైన భాగాన్ని తమ తండ్రి మరణం లాగేసుకుని, కుటుంబంలో పెద్ద లోటు మిగిల్చిందని ఆవేదన వ్యక్తంచేశారు. అయితే, అప్పటి నుంచి వస్తున్న ప్రజలు, సందేశాలు, లేఖలు.. ఇవననీ చూస్తే తమ తండ్రి తమకు ఇంకా పెద్ద కుటుంబాన్ని ఇచ్చి వెళ్లారని తెలిసిందన్నారు. పరికర్ అనారోగ్యం సమయంలో అద్భుతమైన మద్దతు ఇచ్చినందుకు ప్రధాని నరేంద్రమోదీకి కృతజ్ఞతలు తెలిపారు. మిరమార్ బీచ్ వద్ద అంత్యక్రియల సమయంలో సైనిక వందనం ఇచ్చినందుకు సైన్యానికి కూడా కృతజ్ఞతలు తెలిపారు.