లక్నో: యూపీలో ఎస్పీ-బీఎస్పీ కూటమిని వదిలి వెళ్లిన నిషాద్ పార్టీ నేతలతో మాట్లాడేందుకు సమాజ్ వాదీ పార్టీ నాయకుడు అఖిలేశ్ యాదవ్ నిరాకరించారు. 2018 ఉప ఎన్నికలలో గోరఖ్ పూర్ స్థానంలో బీజేపీ అభ్యర్థిని ఓడించి నిషాద్ పార్టీ ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది. గోరఖ్ పూర్, ఫూల్పూర్ స్థానాలలో సీఎం యోగి ఆదిత్యనాథ్, డిప్యూటీ సీఎం కేశవ్ మౌర్య ఎంపీలుగా ఉండేవారు. ఆ స్థానాలలో ఎస్పీ-బీఎస్పీ కలిసి తొలిసారి పోటీ చేసి విజయం సాధించాయి. గోరఖ్ పూర్ స్థానంలో ప్రవీణ్ నిషాద్ అనే నిషాద్ పార్టీ సభ్యుడిని సమాజ్ వాదీ పార్టీ నిలబెట్టింది. అక్కడ వాళ్ల వర్గం ఎక్కువగా ఉండటంతో, రెండు దశాబ్దాలకు పైగా యోగి ఆదిత్యనాథ్ వరుసగా గెలుస్తున్న స్థానాన్ని ప్రవీణ్ నిషాద్ గెలుచుకున్నారు.
అయిేత ఈసారి అక్కడ టికెట్ ప్రవీణ్ కు కాకుండా తమ సొంత పార్టీకి చెందిన మరో నాయకుడికి ఇవ్వడంతో నిషాద్ పార్టీ ఆగ్రహించి, కూటమి నుంచి బయటకు వచ్చేసింది. ఈ పరిణామాలన్నీ రెండు రోజుల్లో జరిగాయి. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ను నిషాద్ పార్టీ అధినేతలు కలిసి, తాము కూటమిలో లేమని ప్రకటించారు. పోస్టర్ల మీద ఎక్కడా తమ పార్టీ పేరు, తమ పేర్లు కూడా వేయలేదని.. దాంతో తమ కార్యకర్తలు, కోర్ కమిటీ సభ్యులు తీవ్ర అసంతృప్తికి గురయ్యారని నిషాద్ తెలిపారు. ఇప్పుడు తమకు స్వేచ్ఛ లభించిందన్నారు. మహరాజ్ గంజ్ స్జానంలో తమ సొంత గుర్తుపై పోటీ చేద్దామనుకుంటే అందుకు సమాజ్ వాదీ సిద్ధంగా లేదని పార్టీ అధికార ప్రతినిధి నిక్కీ నిషాద్ తెలిపారు.