షిమ్లా: హిమాచల్ ప్రదేశ్ బీజేపీ ప్రభుత్వంలో విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్న అనిల్ శర్మ.. తన సొంత కుమారుడికి వ్యతిరేకంగా ప్రచారం చేసేది లేదని చెప్పారు. ఇటీవలే కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆయన కుమారుడు ఆశ్రయ్ శర్మ మండి స్థానం నుంచి ఎంపీగా పోటీ చేస్తున్నారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. దాంతో.. బీజేపీ నేతగా ప్రచారం చేయాల్సి వస్తే కుమారుడికి వ్యతిరేకంగా చేస్తారా అని మీడియా ప్రశ్నించినపుడు.. ఆయన నిష్కర్షగా చేసేది లేదన్నారు. సుఖ్ రాం కుమారుడైన అనిల్ శర్మ.. మండి అసెంబ్లీ నియోజకవర్గం బీజేపీ ఎమ్మెల్యే. మండి లోక్ సభ నియోజకవర్గానికి రాంస్వరూప్ శర్మ ఎంపీగా ఉన్నారు. ఆయనే మరోసారి కూడా పోటీ చేస్తున్నారు. ఎమ్మెల్యేగా ఆయనకు అనుకూలంగా ప్రచారం చేయాల్సి ఉన్నా, అవతల బరిలో తన కొడుకు ఉన్నాడని అనిల్ శర్మ చెబుతున్నారు.
తన తండ్రి సుఖ్ రాం, కొడుకు ఆశ్రయ్ శర్మ కాంగ్రెస్ పార్టీలో చేరినప్పుడే ఆయన ఈ విషయాన్ని బీజేపీ నాయకత్వానికి తెలిపారు. వాళ్లలో ఎవరికి టికెట్ వచ్చినా వాళ్లకు వ్యతిరేకంగా తాను ప్రచారం చేయలేనని చెప్పారు. దీనిపై హిమాచల్ ప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు సత్పాల్ సింగ్ సత్తిని అడిగితే, వాళ్ల కుటుంబ వ్యవహారం గురించి మీడియాకు ఎందుకంత ఆసక్తి అని మండిపడ్డారు. అయితే, ఒక్క మండిలో తప్ప మిగిలిన చోట్ల బీజేపీ అభ్యర్థులకు అనుకూలంగా ప్రచారం చేస్తానని అనిల్ శర్మ అంటున్నారు. 1993, 2012 సంవత్సరాల్లో వీరభద్రసింగ్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వాలలో అనిల్ శర్మ మంత్రిగా పనిచేశారు. 2017 అసెంబ్లీ ఎన్నికలకు ముందు తన తండ్రి సుఖ్ రాంతో కలిసి బీజేపీలో చేరారు.