న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఉత్తర్ప్రదేశ్లోని అమేథీ లోక్సభ స్థానంతో పాటు కేరళలోని వాయనాడ్ నుంచీ పోటీ చేయడం ఖరారైంది. ఈ విషయాన్ని పార్టీ సీనియర్ నాయకుడు ఏకే ఆంటోనీ ఢిల్లీలో ఆదివారం ఉదయం ప్రకటించారు. రాహుల్ రెండో స్థానం నుంచి పోటీ చేయడం ఇదే మొదటిసారి. యూపీలో కాంగ్రెస్ పునాదులు బలహీనపడటం, ముఖ్యంగా 2017 అసెంబ్లీ ఎన్నికల్లో అమేథీ లోక్సభ నియోజకవర్గ పరిధిలోని ఐదింట్లో నాలుగు అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు గెలవడంతో.. అది ఈసారి ఎలాంటి ప్రభావం చూపుతుందోనన్న ఆందోళన కాంగ్రెస్ నేతల్లో కనిపిస్తోంది. గత సార్వత్రిక ఎన్నికలలో రాహుల్పై పోటీ చేసి ఓడిపోయిన బీజేపీ అభ్యర్థిని, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ తరచూ అమేథీని సందర్శిస్తూ తమ పార్టీ కార్యకర్తలకు అందుబాటులో ఉంటున్నారు. రాహుల్ను ఈ సారి ఓడిస్తామని ఆమె పదే పదే చెబుతున్నారు. మరోవైపు ఈ లోక్సభ స్థానంలో కాంగ్రెస్కు వస్తున్న ఓట్ల శాతం కూడా క్రమంగా తగ్గిపోతోంది. ఇంతకుముందు 2009లో 3 లక్షలకు పైగా వచ్చిన మెజారిటీ గత ఎన్నికలల లక్షకు పడిపోయింది. వీటన్నిటి నేపథ్యంలో కాంగ్రెస్ అధ్యక్షుడి కోసం సురక్షితమైన స్థానాన్ని ఆ పార్టీ నేతలు అన్వేషిస్తున్నారు. కర్ణాటక, తమిళనాడు కాంగ్రెస్ నేతలు కూడా ఇప్పటికే తమ తమ రాష్ట్రాల నుంచి పోటీ చేయాలని రాహుల్ను కోరారు.
రాహుల్ గాంధీ కేరళ నుంచి బరిలోకి దిగుతారని స్వయంగా ఆ రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ ముళ్లపల్లి రామచంద్రన్ ప్రకటించారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కేరళలోని వాయనాడ్ పార్లమెంటరీ స్థానం నుంచి బరిలోకి దిగనున్నట్లు రామచంద్రన్ ప్రకటించారు. వాయనాడ్ ప్రాంతం కర్ణాటక- కేరళ రాష్ట్రాల సరిహద్దులో ఉంటుంది. గత నెలరోజులుగా రాహుల్ గాంధీని వాయనాడు నుంచి పోటీకి దింపడంపై సమాలోచనలు చేస్తున్నామని అయితే ముందుగా కాంగ్రెస్ అధ్యక్షుడు పోటీ చేసేందుకు ఒప్పుకోలేదని రామచంద్రన్ చెప్పారు. అయితే రాహుల్ గాంధీని ఒప్పించేందుకు చాలా సమయం పట్టిందని తెలిపారు.
మాజీ ప్రధాని ఇందిరాగాంధీ, యూపీఏ చైర్ పర్సన్ సోనియాగాంధీ కూడా గతంలో దక్షిణ భారతం నుంచి పోటీ చేశారు. అయితే ఇద్దరూ కర్ణాటక బరిలోనే దిగారు. 1978లో ఇందిరాగాంధీ చిక్మగళూరు నుంచి పోటీ చేసి గెలిచారు. 1999లో సోనియాగాంధీ బళ్లారి నుంచి పోటీచేశారు. బళ్లారిలో ఆమె సుష్మా స్వరాజ్ పై పోటీచేసి గెలుపొందారు.