తిండి పెట్టకుండా చంపిన భర్త.. అత్త
అదనపు కట్నం కోసం కేరళలో ఘోరం
మరణించిన మహిళ బరువు 20 కిలోలే
కరునాగప్పల్లి (కేరళ): కట్నం కోసం వేధించేవాళ్లను చూశాం. రాచిరంపాన పెట్టడమూ తెలుసు. కానీ రోజుల తరబడి కనీసం తినడానికి తిండి కూడా పెట్టకుండా చంపేయడం తెలుసా? ఈ దారుణం కేరళలోని కరునాగప్పల్లి ప్రాంతంలో చోటుచేసుకుంది. రోజుల తరబడి ఆమె భర్త, అత్త కలిసి ఆమెను తిండిపెట్టకుండా మాడ్చేయడంతో 27 ఏళ్ల తుషార చివరకు ఎముకల గూడులా మారిపోయి, ప్రాణాలు వదిలింది. చనిపోయే సమయానికి ఆమె బరువు కేవలం 20 కిలోలు మాత్రమే ఉందంటే పరిస్థితి ఎంత దారుణమో తెలుస్తుంది. కొన్ని రోజుల పాటు కేవలం నానబెట్టిన బియ్యం, పంచదార నీళ్లు మాత్రమే ఇచ్చేవారు. దాంతో చివరకు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ తుషార మరణించింది. దాంతో ఆమె భర్త చందులాల్, అత్త గీతాలాల్ ఇద్దరినీ పోలీసులు అరెస్టుచేసి రిమాండుకు పంపారు. తుషార మరణించిన తర్వాతే వాళ్లు పెట్టిన చిత్రహింసలు పోలీసు విచారణలో బయటికొచ్చాయి.
ఆమె కేవలం ఎముకల గూడులా ఉందని, ఒంటిమీద అసలు కండ అన్నది లేనే లేదని పోలీసు అధికారి ఒకరు చెప్పారు. తుషార మరణించే సమయానికి కేవలం 20 కిలోల బరువుందని, కేవలం మరింత కట్నం తేవాలనే అత్త, భర్త కలిసి ఆమెను చిత్రహింసలు పెట్టారని ఆయన అన్నారు. గత ఐదేళ్లుగా వాళ్లు ఆమెను హింసిస్తున్నారని, కనీసం తమ కుటుంబ సభ్యులను ఏడాదికోసారి కూడా చూడనివ్వడం లేదని తుషార తల్లి విజయలక్ష్మి ఆరోపించారు. వాళ్లు తమ కూతుర్ని చంపేస్తారన్న భయంతోనే ఇన్నాళ్లూ పోలీసులకు ఫిర్యాదు చేయలేదన్నారు. చందూలాల్, గీత కలిసి తుషారను శారీరకంగా, మానసికంగా చిత్రహింసలు పెట్టేవారని ఇరుగుపొరుగులు కూడా చెప్పారు. చందూలాల్ వెల్డింగుతో పాటు వేరే చిన్న పనులు చేసేవాడు. వాళ్లకు 3 ఏళ్లు, ఒకటిన్నర ఏడాది వయసున్న ఇద్దరు పిల్లలున్నారు.