నరసాపురం, మార్చి 31: హేమాహేమీలు తలపడుతున్న నరసాపురం లోక్సభ స్థానంలో విజేత ఎవరవుతారన్న దానిపై అందరిలో ఆసక్తి నెలకొని ఉంది. ఈ నియోజకవర్గం నుండి ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు ఇండిపెండెంట్లు రంగంలో ఉన్నప్పటికీ ప్రధానమైన పోటీ టిడిపి, కాంగ్రెస్, జనసేన మధ్యే కనబడుతోంది.
తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఉండి అసెంబ్లీ సీటు సిట్టింగ్ ఎమ్మెల్యే వేటుకూరి వెంకట శివరామరాజు, వైసిపి అభ్యర్థిగా పారిశ్రామికవేత్త కె రఘురామ కృష్ణంరాజు, జనసేన అభ్యర్థిగా ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సోదరుడు, ప్రముఖ సినీ నటుడు కె నాగబాబు, బిజెపి తరుపున మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మాజీ ఎంపి కనుమూరి బాపిరాజు. ప్రజాశాంతి పార్టీ తరపున ఆ పార్టీ అధ్యక్షుడు కెఎ పాల్ తదితరులు ఎన్నికల బరిలో ఉన్నారు.
ఈ పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలో ఆచంట, పాలకొల్లు, నరసాపురం, భీమవరం, ఉండి, తణుకు, తాడేపల్లిగూడెం అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి.
ఇప్పటి వరకూ ఈ పార్లమెంటరీ నియోజకవర్గానికి జరిగిన 16 ఎన్నికల్లో ఎక్కువ పర్యాయాలు క్షత్రియులు (రాజులు) విజయం సాధిస్తూ వచ్చారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తరువాత 1984నుండి మూడు పర్యాయాలు టిడిపి అభ్యర్థిగా భూపతిరాజు విజయకుమార్ రాజు విజయం సాధించగా 1996లో టిడిపి అభ్యర్థిగా పోటీ చేసిన క్షత్రియేతరుడు కొత్తపల్లి సుబ్బారాయుడు విజయం సాధించారు. 1988,2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుండి కనుమూరి బాపిరాజు, 1999లో ప్రముఖ సినీనటుడు యువి కృష్ణంరాజు బిజెపి అభ్యర్థిగా గెలిచారు. 2004లో మరో మారు క్షత్రియేతరుడైన చేగొండి హరిరామ జోగయ్య కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా విజయం సాధించారు. 2014 ఎన్నికల్లో టిడిపి పొత్తుతో బిజెపి అభ్యర్థి గోకరాజు గంగరాజు విజయం సాధించారు.
ఈ పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలోని భీమవరం అసెంబ్లీ స్థానం నుండి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారు.
2014 ఎన్నికల్లో బిజెపి అభ్యర్థి గోకరాజు గంగరాజు 85వేల పైచిలుకు ఓట్ల మెజార్టీతో వైసిపి అభ్యర్థి వంక రవీంద్రనాధ్పై విజయం సాధించారు. గోకరాజు గంగరాజుకు 5,40,306ఓట్లు రాగా రవీంద్రనాధ్కు 4,54,955ఓట్లు వచ్చాయి.
2009 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి కనుమూరి బాపిరాజు టిడిపి అభ్యర్థి తోట శివరామ లక్ష్మిపై లక్షా 14వేల ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు. ఆ ఎన్నికల్లో కనుమూరి బాపిరాజుకు 3,89,422ఓట్లు, టిడిపి అభ్యర్థి తోట శివ రామలక్ష్మికి 2,74,732ఓట్లు వచ్చాయి. ఆనాడు పిఆర్పి అభ్యర్థిగా రంగంలో ఉన్న గుబ్బల తమ్మయ్యకు 2,67,058ఓట్లు వచ్చాయి. ఈ పార్లమెంటరీ నియోజకవర్గం పరిధిలోని పాలకొల్లు అసెంబ్లీ సీటు నుండి పిఆర్పి అధినేత చిరంజీవి పోటీ చేసి ఓడిపోయారు. నాటి ఎన్నికల్లో ఈ పార్లమెంట్ పరిధిలోని తాడేపల్లిగూడెం పిఆర్పి అభ్యర్థి ఈలి నాని ఒక్కరే విజయం సాధించారు.
ఈ ఎన్నికల్లో వైసిపి, టిడిపి అభ్యర్థులు ఆర్థికంగా ధనవంతులు కావడం వారికి అనుకూల అంశాలు కాగా సినీ నటుడిగానే కాక జబర్దస్త్ కామెడీ షోతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకొని ఉండటం జనసేన అభ్యర్థి నాగబాబుకు అనుకూలమైన అంశాలుగా పేర్కొంటున్నారు. దీనికి తోడు పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఈ పార్ల మెంట్ సీటు పరిధిలోని భీమవరం నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్నందున వారికి అనుకూలంగా ఉండవచ్చని చెబుతున్నారు.
ఎన్నికల ప్రచార పర్వంలో దూసుకువెళుతున్న ప్రధాన పార్టీల అభ్యర్థులు అందరూ ఎవరికి వారు గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తూ ముందుకు సాగుతున్నారు.