రామచంద్రాపురం శిరోముండనం కేసును వైసిపి రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ తిరగదోడడంతో అదే పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు ఇబ్బంది పడే సూచనలు గోచరిస్తున్నాయి.
ఇరవై సంవత్సరాల క్రితం తోట త్రిమూర్తులు ప్రమేయంతో ఒక దళితులకు శిరోముండనం జరిగిందన్న కేసు పెండింగ్లో ఉంది.అయితే అది ఇప్పటి వరకు విచారణకు నోచుకోలేదు.ఎప్పటికప్పుడు త్రిమూర్తులు అధికార పార్టీ పంచన చేరుతూ ఈ కేసును తొక్కిపెడుతున్నారని విమర్శలైతే ఉన్నాయి.తాజాగా వైసీపీ రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ ఏపీ హోంమంత్రి సుచరితకు ఈ కేసు విషయమై లేఖ రాశారు. దళితుల శిరోముండనం కేసు విచారణ వేగవంతం చేయాలని పిల్లి సుభాష్ ఆ లేఖలో కోరారు. దళితుల శిరోముండనం కేసులోఏ1గా తోట త్రిమూర్తులు ఉన్నారని, 20 ఏళ్లుగా కేసు తేలకుండా పలుకుబడితో విచారణకు రాకుండా వాయిదా వేయించుకుంటున్నారని, పబ్లిక్ప్రాసిక్యూటర్ను మార్చే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు.
దళిత సామాజికవర్గానికి చెందిన బాధితులు త్రిమూర్తులుతో పోరాడే స్థాయి లేని వారని సుభాష్ చంద్రబోస్ తన లేఖలో పేర్కొన్నారు వెంటనే బాధితులకు న్యాయం చేయాలని ఆయన హోం మంత్రిని కోరారు.ప్రస్తుతం ఈ వ్యవహారం వైసిపి లో హాట్ టాపిక్ అయ్యింది. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఈ ఇద్దరు నేతల మధ్య ఎప్పటి నుంచో వైరం ఉంది. 2004…2009 ఎన్నికల్లో సుభాష్ చంద్రబోస్ కాంగ్రెస్ అభ్యర్థిగా రామచంద్రపురంలో త్రిమూర్తులను ఓడించారు.2014 ఎన్నికల్లో తోట త్రిమూర్తులు టిడిపి పక్షాన పోటీచేసి తన చిరకాల ప్రత్యర్థి,వైసిపి అభ్యర్థి సుభాష్చంద్రబోసు పై విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో సుభాష్ చంద్రబోస్ మండపేటకు వెళ్లిపోయారు. తోట త్రిమూర్తులు రామచంద్రాపురంలోనే టిడిపి అభ్యర్థిగా పోటీకి దిగి ప్రస్తుత మంత్రి వేణుగోపాల్ చేతిలో ఓటమి పాలయ్యారు.
మండపేటలో సుభాష్ చంద్రబోస్ ఓడిపోయినప్పటికీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఆయనకు తన తండ్రి వైయస్ రాజశేఖర రెడ్డితో ఉన్న సాన్నిహిత్యాన్ని గుర్తించి ఎమ్మెల్సీ కోటాలో మంత్రి పదవి ఇచ్చారు. ఇటీవలే ఆయనను రాజ్యసభకు కూడా పంపారు.అయితే ఈ మధ్యే తోట త్రిమూర్తులు కూడా వైసీపీ పంచన చేరారు.కాపు కుల సమీకరణాల నేపధ్యంలో జగన్ ఆయన్ను పార్టీలోకి రానిచ్చారు. పైగా మండపేట నియోజకవర్గ వైసీపీ ఇన్ ఛార్జి పదవి కూడా ఇచ్చారు.కానీ ఇది సుభాష్చంద్రబోస్కు కు నచ్చినట్టు లేదు. త్రిమూర్తులు పార్టీలో చేరినప్పుడు సుభాష్ చంద్రబోస్ వ్యతిరేకంచినట్లు కనిపించకుండానే తెరవెనక రాజకీయం చేసి ఇప్పుడు మళ్లీ ఆయన మీద ఉన్న శిరోముండనం కేసునుతెరపైకి తెచ్చారు.దీనిపై సీఎం ,హోంమంత్రుల స్పందన ఎలా ఉంటుందో చూడాలి!