ఇష్టంగా పెళ్లి చేసుకుని కష్టంగా కాపురం చేస్తున్నట్టుంది.. ఏపీలో బీజేపీ-జనసేన పరిస్థితి. దాదాపు ఏడాది క్రితం పొత్తు పెట్టుకున్న ఈ రెండు పార్టీలు కలిసే వెళ్తున్నాయా.. అంటే సమాధానం లేని ప్రశ్నే! రెండు పార్టీల నాయకుల మాటలకు, చేతలకు పొంతన ఉండటం లేదు. ఇందుకు ఉదాహరణలూ లేకపోలేదు. తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికలపై దృష్టి పెట్టాయి ఏపీ పార్టీలు. వైసీపీ ఎంపీ బల్లి దుర్గారావు ఆకస్మిక మృతితో అక్కడ ఏ క్షణానైనా ఉప ఎన్నిక నోటిఫికేషన్ వచ్చేలా ఉంది. ఈ నేపథ్యంలో ఈ రెండు పార్టీల తీరు.. వీరి మైత్రిపై అనుమానాలు రేకెత్తిస్తోంది.
బీజేపీ జెట్ స్పీడ్ ఎందుకో..
దుర్గాప్రసాద్ మరణించిన 20 రోజులకే ఉపఎన్నికపై దృష్టి పెట్టింది బీజేపీ. రాష్ట్రంలో తమ బలమేంటో తెలిసి కూడా అభ్యర్ధి.. వ్యూహాలు.. అంటూ తిరుపతిలో మీటింగ్ కూడా పెట్టేసింది. అధిష్టానానికి తెలీకుండా ఇలా మీటింగ్ పెట్టడం సాధ్యం కానిది. అయితే.. బీజేపీ నాయకులకు మరింత బలాన్నిచ్చే సంఘటన ఈమధ్య తెలంగాణలో జరిగింది. దుబ్బాక ఉపఎన్నికలో బీజేపీ అనూహ్య విజయం.. ఏపీ బీజేపీ పొలంలో మొలకలు వచ్చేలా చేసింది. ఇక్కడా అలాంటి మ్యాజిక్ చేయాలని ఫిక్స్ అయిపోయారు. ఇక్కడి వరకూ ఓకే..! మరి.. ఫ్రెండ్ ‘జనసేన’ పరిస్థితేంటి?
జనసేన బలం బీజేపీకి తెలియదా..!
జనసేనకు తిరుపతిలో ఖచ్చితంగా బలం ఉంటుంది. మెగా ఫ్యాన్స్ ఎక్కువ. చిరంజీవిని గెలిపించిన ఊరు. దీంతో జనసేనకు మద్దతు ఉంది. జనసేన-బీజేపీ కలిసి అభ్యర్ధిని నిలబెడితే వైసీపీ, టీడీపీకి గట్టి పోటీ ఇవ్వొచ్చు… గెలవనూ వచ్చు. కానీ.. క్షేత్రస్థాయి పరిస్థితులు అలా లేవు. ఇందుకే ఈనెల 17,18 తేదీల్లో పవన్ మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో అత్యవసర సమావేశం నిర్ణయించారని తెలుస్తోంది. బీజేపీకి తిరుపతిలో 2లక్షలు.. జనసేనకు 15 లక్షలకు పైగా ఓటింగ్ ఉన్నట్టు అంచనా. కానీ.. జనసేన బలం వదిలేసి.. బీజేపీ అక్కడ ఎందుకు ఒంటరిగా సై అంటుందో ఎవరికీ అర్ధం కానిది.
బీజేపీ-జనసేన పొత్తు వీడినట్టేనా..?
బీజేపీ ఏం చేసినా జనసేన మద్దతిస్తోంది. జనసేనతో కలిసే వెళ్తామని బీజేపీ కూడా చెప్పింది. మాటలే కానీ.. కలిసి చేసిన ప్రజా కార్యక్రమం లేదు. పైగా కరోనా ముసుగులో ఈ రెండు పార్టీల అసలు రంగు తెలీకుండా పోయింది. ఇప్పుడు బీజేపీ మొదలుపెట్టిన ఒంటరి పోరుతో రంగులు వీడుతున్నాయి. మరి జనసేన ఎలా స్పందిస్తుందో.. ఇందులోని వాస్తవాలేంటో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.