నంద్యాల ఆటో డ్రైవర్ అబ్లుద్ సలాం కుటుంబం ఆత్మహత్య కేసులో అరెస్టు అయిన నిందితులు సీఐ, హెడ్ కానిస్టేబుళ్లకు కోర్టు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. అరెస్టు చేసి కోర్టుకు హజరుపర్చిన రోజే ఒ నాన్ బెయిలబుల్ సెక్షన్ను తొలగించి బెయిల్ ఇవ్వడంపై పోలీస్ శాఖ ఖంగుతున్నది.
ఒక పక్క ముస్లిం కుటుంబం ఆత్మహత్యకు పురిగొల్పిన పోలీసు అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆ సంఘాల నుండి డిమాండ్ వస్తున్న నేపథ్యంలో నిందితులకు వెంటనే బెయిల్ మంజూరు కావడం జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వమే నిందితుల బెయిల్ రద్దుకు పోలీస్ శాఖ ద్వారా పిటిషన్ దాఖలు చేయాలని నిర్ణయించుకున్నది. ప్రభుత్వ ఆదేశాల మేరకు సస్పెన్షన్లో ఉన్న సీఐ సోమశేఖరరెడ్డి, హెడ్ కానిస్టేబుల్ గంగాదర్ ల బెయిల్ రద్దు చేయాలని కోరుతూ కర్నూరు ఎస్పీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. నిందితులను సెక్షన్ 303,509తో పాటు నాన్ బెయిలబుల్ సెక్షన్ 306 కింద అరెస్టు చేశారు. అయితే నిందితుల తరపు న్యాయవాదులు తమ వాదనలు వినిపిస్తూ ఈ కేసులో 306 సెక్షన్ వర్తించదని న్యాయమూర్తి దృష్టికి తీసుకురావడంతో ఆ సెక్షన్ ను తొలగించి బెయిల్ మంజూరు చేశారు.
ఈ నేపథ్యంలో నిందితులకు బెయిల్ ఇవ్వడం వల్ల సాక్షులను బెదిరించి, భయపెట్టి కేసు దర్యాప్తును ఆటంకపరిచే అవకాశం ఉందని బెయిల్ రద్దు కోరుతూ దాఖలు చేసిన పిటిషన్లో ఎస్పి పేర్కొన్నారు. అదే విధంగా ఆత్మహత్యకు పురిగొల్పారన్న ఆరోపణతో నిందితులపై నాన్ బెయిలబుల్ సెక్షన్ 306 కింద కేసు నమోదు చేశామన్నారు. ఆత్మహత్యకు ముందు బాధిత కుటుంబ సెల్ఫీ వీడియోలో ఈ ఇద్దరు నిందితుల పేర్లు ప్రస్థావించిన విషయాన్ని గుర్తు చేశారు. పోలీస్ అధికారులే నిందితులుగా ఉన్న కేసులో వారి బెయిల్ రద్దు కోరుతూ ఆ శాఖ అధికారులు పిటిషన్ దాఖలు చేయడం ఇదే ప్రధమం అని తెలుస్తోంది. న్యాయమూర్తి దీనిపై ఏ విధంగా స్పందిస్తారనేది వేచి చూడాలి.