‘ఇసుక’.. ఈ పదం ఏపీలో హాట్ టాపిక్. 2019 ఎన్నికల్లో టీడీపీ అధికారం కోల్పోవడానికి ఒక కారణం. అధికారంలోకి వచ్చిన వైసీపీ ఇసుక విధానంలో మార్పులు తెస్తుందనే ఆశ. ఏడాదిన్నర పూర్తైంది. మరి.. ఇసుకలో ఏమైనా మార్పులు తెచ్చిందా.. గత ప్రభుత్వం కంటే తక్కువ ధరకే అందిస్తోందా.. నిర్మాణ రంగం ఊపందుకుందా.. కార్మికులు సంతోషంగా ఉన్నారా.. ప్రభుత్వం కొత్త పాలసీపై ప్రజలు హ్యాపీనా..? అనే విషయాలకు అటుఇటుగా సమాధానం వస్తుందే తప్ప.. ప్రభుత్వం వైపే తూకం తూగదు. రీసెంట్ గా తెచ్చిన కొత్త పాలసీ ప్రకారం గత ఏడాది వైసీపీ తెచ్చిన కొత్త పాలసీ ఫెయిల్ అయినట్టే. మరి ఈసారి ఏ ఫలితాన్ని ఇస్తందో..?
టీడీపీని ముంచిన ఇసుక..!
టీడీపీ 2014లో అధికారంలోకి వచ్చాక ఇసుకను ఉచితం చేసింది. అయితే.. అక్రమాలు అదే విధంగా జరిగాయి. తమిళనాడుకు అక్రమంగా తరలిపోయిన ఇసుకకు లెక్క లేదు..! టీడీపీ నాయకులపైనే ఎన్నో ఆరోపణలు. స్వర్ణముఖి నది, కష్ణా నది.. ఎక్కడ చూసినా అక్రమాలు. 2017లో చిత్తూరు జిల్లా ఏర్పేడులో ఇసుక అక్రమాలపై ధర్నా చేస్తున్న గ్రామస్థులపైకి లారీ దూసుకెళ్లి 22 మంది వరకూ చనిపోయారు. ఇవన్నీ టీడీపీకి శాపాలయ్యాయి. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఇసుక ఆపేసింది. నిర్మాణ రంగం ఆగిపోయింది. భవన నిర్మాణ కార్మికులతో జనసేన విశాఖలో ఆందోళన చేపట్టింది. కొత్త ఇసుక పాలసీ తెచ్చింది. కానీ.. ఏడాదిలో మళ్లీ కొత్త పాలసీ తీసుకొచ్చింది. దీంతో ఇసుక వైఫల్యాన్ని ప్రభుత్వం ఒప్పుకున్నట్టైంది.
వైసీపీని ఏ తీరానికి చేర్చుతుందో ఈ ఇసుక..!
కొత్త ఇసుక పాలసీలో రూ.375 ధర నిర్ణయించింది ప్రభుత్వం. 8కిమీ పరిధిలో ఎడ్లబండ్లతో వచ్చిన వారికి ఇసుక ఫ్రీ లోడింగ్. ఇసుక రీచ్ లను కేంద్ర ప్రభుత్వ సంస్థలకు అప్పగించేందుకు సిద్ధమైంది. ఒకవేళ ఎవరూ రాకపోతే ఓపెన్ టెండర్ ద్వారా ప్రైవేటు సంస్థలకు అప్పగించి ఆదాయం తెచ్చుకోవాలని భావిస్తోంది. టీడీపీ హయాంలో ఇసుక తవ్వకం, లోడింగ్ ఖర్చులు తీసుకుని ఇసుకను ఉచితంగా ఇచ్చింది. ఇప్పుడు వైసీపీ తవ్వకం, లోడింగ్ ఖర్చులకు ధర నిర్ణయించి ఇసుక ఇస్తోంది. అయితే.. రాష్ట్రవ్యాప్తంగా 60 నుంచి 70 నియోజకవర్గాల్లో తరచూ జరిగే ఇసుక అక్రమాలను ఎలా అరికడతారు అనేదానికి ప్రభుత్వం వద్ద సరైన పరిష్కారం లేదని చెప్పాలి.