రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కల్గించిన విజయవాడ స్వర్ణ ప్యాలెస్ కోవిడ్ కేర్ సెంటర్ అగ్ని ప్రమాద కేసులో రమేష్ ఆసుపత్రి అధినేత డాక్టర్ రమేష్ పోలీసు విచారణకు హజరైయ్యారు. ఈ రోజు మూడు మూడు రోజుల పాటు డాక్టర్ రమేష్ను పోలీసులు విచారించనున్నారు. రమేష్ను అదుపులోకి తీసుకుని విచారించేందుకు హైకోర్టు పోలీసులకు అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. కోర్టు ఆదేశాల మేరకు డాక్టర్ రమేష్ విజయవాడలోని సూర్యారావుపేట పోలీస్ స్టేషన్కు హజరయ్యారు. న్యాయవాది సమక్షంలో డాక్టర్ రమేష్ను విచారించాలని హైకోర్టు ధర్మాసనం పేర్కొన్నది.
ఈ ఏడాది ఆగస్టు 9న విజయవాడ స్వర్ణ ప్యాలెస్ కోవిడ్ కేర్ సెంటర్లో జరిగిన అగ్ని ప్రమాదంలో పది మంది మృతి చెందగా 20 మంది గాయపడిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో డాక్టర్ రమేష్తో పాటు మరి కొందరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో డాక్టర్ రమేష్ను అరెస్టు చేసి విచారించేందుకు తొలుత పోలీసులు ప్రయత్నించగా ఆయన హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో తదుపరి చర్యలను నిలుపుదల చేస్తూ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఏపి ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా హైకోర్టు ఉత్తర్వులను కొట్టివేస్తూ విచారణకు అనుమతి ఇచ్చింది. పోలీసు విచారణకు డాక్టర్ రమేష్ సహకరించాలని సూప్రీం ధర్మాసనం ఆదేశించింది.
ఈ నేపథ్యంలో డాక్టర్ రమేష్కు పోలీసులు విచారణకు హజరుకావాలని నోటీసులు జారీ చేయగా కోవిడ్ ఉదృతి నేపథ్యంలో ఆన్ లైన్ విచారణకు హజరు అవుతానని సమాధానం ఇవ్వడం తీవ్ర చర్చనీయాంశమైంది. దీంతో ఏపి ప్రభుత్వం ఈ కేసు దర్యాప్తునకు డాక్టర్ రమేష్ ను కస్టడీయల్ విచారణకు అనుమతులు ఇవ్వాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించగా ఈ నెల 30వ తేదీ నుండి మూడు రోజుల పాటు న్యాయవాది సమక్షంలో విచారణ చేసేందుకు ధర్మాసనం అనుమతి ఇచ్చింది.