తాడికొండ వైసిపి ఎమ్మెల్యే డాక్టర్ ఉండవల్లి శ్రీదేవి పేకాట రాయుళ్లకు సహకారం అందిస్తున్నారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.గతంలో ఆమె తన అనుచరుడు సందీప్ కు ఫోన్ చేసి తాడికొండ నియోజకవర్గ పరిధిలో పేకాట క్లబ్బుల నిర్వహణకు సహకారం అందించాల్సిందిగా కోరిన ఆడియోటేప్ బయటకు రావడం విదితమే.
తాడికొండ నియోజకవర్గ పరిధిలో ఉన్న ఫిరంగిపురం తదితర ప్రాంతాల్లో గల మామిడి తోటల్లో పేకాట క్లబ్బుల నిర్వహణకు ఏర్పాట్లు చేయాల్సిందిగా ఆమె తన అనుచరులను ఫోన్లో కోరారు.పేకాట క్లబ్బుల నిర్వహణకు సహకరిస్తే తమ అందరికీ బాగా డబ్బులొస్తాయని ఆమె తన అనుచరునికి ఆ ఫోన్లో చెప్పడం కూడా ఆడియో టేపులో అందరూ విన్నారు.అయితే అది మార్ఫింగ్ ఆడియో టేప్ అని,తన గొంతును అనుకరించి ఆ ఆడియో టేపును విడుదల చేశారని ,తాను అలా మాట్లాడ లేదని ఉండవల్లి శ్రీదేవి తర్వాత వివరణ ఇవ్వడం వేరే విషయం.
ఈ పేకాట వివాదం ఇంకా సద్దుమణగక ముందే తెలుగుదేశం పార్టీ మళ్లీ ఉండవల్లి శ్రీదేవి ని టార్గెట్ చేస్తూ గురువారం ఒక వీడియోను సోషల్ మీడియాలో విడుదల చేసింది.తాడికొండ నియోజకవర్గంలోని శివ క్షేత్రం సమీపంలో ఉన్న లంకలో స్థానిక ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి అనుచరులు ఇట్టావెంకటేశ్వర్లు, ఇట్టా ఆదినారాయణ, రాంబాబు ల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పేకాట దందా నిర్వహిస్తున్నారని టిడిపి పేర్కొనడమే కాకుండా సదరు దృశ్యం తో కూడిన వీడియోను అప్ లోడ్ చేసింది.ఆ వీడియోలో ఉన్న దృశ్యం అందరినీ ఆశ్చర్యపరిచేదిగా వుంది.ఏదో సంతో జాతరో జరుగుతున్నట్లు అక్కడ పెద్ద సంఖ్యలో పేకాటరాయుళ్లు గుమికూడి ఆడేస్తున్నారు.
ఇదేదో రాత్రిపూట జరుగుతున్న వ్యవహారం కూడా కాదు.పట్టపగలే నిర్భయంగా పేకాటరాయుళ్లు చెలరేగిపోతున్నారు.కాగా ఇలాంటి ఆసాంఘిక కార్యకలాపాలను ఒక మహిళా ఎమ్మెల్యే ప్రోత్సహించటం సిగ్గుచేటని టిడిపి విమర్శించింది. జూదరుల చేష్టలతో స్థానిక మహిళలు ఇబ్బందు పడుతున్నారని టిడిపి వాపోయింది. వెంటనే శివక్షేత్రం సమీపంలో జూదం నడిపిస్తున్న వారిమీద, వారికి అండగా ఉంటున్న పోలీసు అధికారులు పై, చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేసింది.సాక్ష్యాధారాలతో సహా తెలుగుదేశం పార్టీ బయటపెట్టిన ఈ పేకాట శిబిరాల నిర్వహణ వీడియోతో వైసిపి ఇరకాటంలో పడింది. మరి పార్టీ అధినేత జగన్,గుంటూరు జిల్లాకే చెందిన మహిళా హోంమంత్రి సుచరిత ఏం చేస్తారో చూడాలి!