ఏపీలో వైసీపీ ఘన విజయం సాధించడంలో రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ టీం కీలక పాత్ర వహించింది. 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు వైసీపీ ప్రశాంత్ కిషోర్ బృందాన్ని తన కన్సల్టెంట్గా నియమించుకుంది. రెండు సంవత్సరాల ముందే రంగంలోకి దిగిన ప్రశాంత్ కిషోర్కు చెందిన ‘ఐ ఫ్యాక్’ బృందం సభ్యులు మండలాలు, జిల్లాల వారీగా తమ బృందాలను నియమించుకుంది. వ్యూహాల నుంచి ప్రచారం వరకు పార్టీ అధినేత జగన్తో పాటు శ్రేణులను ముందుండి నడిపించింది. ప్రశాంత్ కిషోర్ టీం కొందరు కీలక వ్యక్తులు బృందాన్ని నడిపిస్తూ వైసీపీకి ఘన విజయం కట్టబెట్టారు. ఇప్పుడు ఇలాంటి వ్యూహాంతోనే వచ్చే ఎన్నికలకు టీడీపీ సిద్ధమైనట్లు పొలిటికల్ సర్కిల్లో హాట్హాట్గా చర్చలు సాగుతున్నాయి.
చేదు అనుభవం నేర్పిన గుణపాఠం!
అయితే ప్రశాంత్ కిషోర్ బృందం నియామకాన్ని తెలుగుదేశం పార్టీ తొలుత లైట్గా తీసుకుంది. నంద్యాల ఉప ఎన్నికల్లో సాధించిన విజయంతో ఆ పార్టీ పీకే బృందాన్ని అంతగా పట్టించుకోలేదన్న వాదనలున్నాయి. ఐ-ప్యాక్ కొన్ని కీలక వ్యూహాలను అమలు చేసి ప్రజల నాడి పసిగట్టగలిగిందని చెబుతారు. అప్పుడు అధికారంలో ఉన్న టీడీపీ చేపట్టిన సంక్షేమ కార్యక్రమాల లోపాలు ఎత్తిచూపటం.. రాజధాని అమరావతిలో ఒకే కులం తిష్టవేసిందని ప్రచారం చేయడం.. ప్రభుత్వంలో అవినీతి పెరిగిందని ప్రజల్లోకి తీసుకువెళ్లడం.. నిరంతరం రాజకీయ కార్యకలాపాలు నిర్వహించడం.. నవరత్నాలు పథకాలపై విస్తృతంగా ప్రచారం చేసింది. సుదీర్ఘంగా జరిగిన జగన్ పాదయాత్రలో వివిధ సంక్షేమ కార్యక్రమాలను వ్యూహాత్మకంగా ప్రకటించడం.. రావాలి జగన్, కావాలి జగన్ అంటూ ట్యూన్లు రూపొందించడం వంటి అనేక కార్యక్రమాలు పీకే బృందం చేపట్టింది. చివరకు అభ్యర్ధుల ఎంపికలో కూడా కీలకపాత్ర పోషించింది.అన్నీ కలిసొచ్చి వైసిపి అఖండ విజయం సాధించింది !
ప్రశాంత్ కిషోర్ శిష్యుడే టిడిపి కన్సల్టెంట్
2019 ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత నిర్వహించిన పోస్ట్ మార్టంలో టీడీపీకి ఈ తత్వం బోధపడిందట. ప్రశాంత్ కిషోర్ బృందం కన్సల్టెన్సీ సేవల ప్రభావం ఏమిటో కూడా ఆ పార్టీ నేతలకు తెలిసివచ్చిందంటారు. అందుకే తెలుగుదేశం పార్టీ కూడా కన్సల్టెంట్ల వైపు దృష్టి సారించింది. ఇటీవలే ప్రశాంత్ కిషోర్ బృందంలో కీలకపాత్ర పోషించిన రాబిన్ శర్మ ఫో టైమ్ సంస్థను ఏర్పాటు చేశారు. ఈ ఫో టైమ్ సంస్థను టీడీపీ కన్సల్టెన్సీగా నియమించుకుంది. ఇప్పటికే పని ప్రారంభించిన ఫో టైమ్ సంస్థ రాష్ట్రంలో కొంతమందిని నియమించుకోవడం మొదలుపెట్టింది. పార్టీ వ్యవహారాలను కూడా పరిశీలిస్తోంది. ఇదే సమయంలో తిరుపతి లోక్ సభ ఉప ఎన్నిక రావడంతో..అక్కడినుంచే కార్యకలాపాలు ప్రారంభించింది. ఫో టైమ్ నిర్వహకులు రాబిన్ శర్మ సైతం తిరుపతిలో మకాం వేసి..స్థానిక టీడీపీ నేతలతో పాటు తమ బృందానికి సలహాలు, సూచనలు ఇస్తున్నారు. రాబిన్ శర్మ కన్సల్టెన్సీ సేవలు టీడీపీకి ఏ మేరకు ఉపయోగపడుతాయో తెలియాలంటే కొద్ది కాలం వేచిచూడాలి.