అమరావతి: తమపై పదేపదే ట్వీట్లు పెట్టే విజయసాయిరెడ్డి ఇటీవల సెర్బియాలో జరిగిన అరెస్టుపై ఎందుకు ట్వీట్ చేయడం లేదని టిడిపికి చెందిన మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ప్రశ్నించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ బెయిల్పై బయట తిరుగుతున్న విజయసాయిరెడ్డి తమను బెదిరించడం విడ్డూరంగా ఉందని అన్నారు. ‘ఇంటర్ పోల్ నిందితులు మీరు. మీ సహచరుడిని అరెస్టు చేస్తే విడిపించడానికి ప్రధాని చుట్టూ తిరుగుతున్నారు. దమ్ముంటే వీటిపై ట్వీట్ చెయ్. కేసుల నుండి బయటపడేందుకు ప్రధాని కాళ్లపై పడింది మీరు. మీరా నీతి సూత్రాలు వల్లించేది’ అంటూ దేవినేని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
పోలవరం విషయంలో జగన్ అసత్యాలు ప్రచారం చేస్తున్నారనీ, పునాదులు లేపకపోతే స్పిల్ ఛానల్ దాటి నీరు ఎలా వచ్చిందని ఉమ ప్రశ్నించారు. చేసిన అసత్య ప్రచారాలకు ఇప్పటికైనా లెంపలు వేసుకోండని దేవినేని అన్నారు.
ప్రభుత్వం మారగానే బందరు పోర్టు పనులు చేసే యంత్రాలు వెనక్కు వెళ్లిపోయాయని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. ప్రభుత్వ బెదిరింపులకు భయపడే ఆ నిర్మాణ సంస్థ వెనక్కి పోయిందని ఆయన విమర్శించారు. బందరు పోర్టును తెలంగాణ ప్రభుత్వానికి ఎంతకు అమ్మేశారని దేవినేని ప్రశ్నించారు. జగన్ ప్రభుత్వం క్విడ్ ప్రొకో ద్వారా బందరు పోర్టును తెలంగాణకు ఇచ్చేసిందని ఆయన విమర్శించారు.