TDP YSRCP: రాష్ట్రంలో కోవిడ్ సెకండ్ వేవ్ ఉధృతం అవుతున్న వేళ అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ నేతల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణల మాటలు యుద్దంతో పాటు పోలీస్ కేసుల వరకూ వెళుతోంది. ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబుపై కర్నూలు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. కర్నూల్ జిల్లా కేంద్రంగా ఎన్ 440 కే కరోనా వేరియంట్ ఉన్నట్లు చంద్రబాబు అసత్య ప్రచారం చేసి ప్రజలను భయభ్రాంతులకు గురి చేశారన్న అభియోగంపై ఓ న్యాయవాది ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. ఈ రోజు చంద్రబాబుకు నోటీసులు కూడా అందించారు. చంద్రబాబుపై కేసు నమోదు చేయడంపై ఆ పార్టీ నాయకులు అధికార వైసీపీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు.
సాధారణంగా గ్రామాల్లో, పట్టణాల్లో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేసిన వెంటనే నిందితుల తాలూకు వాళ్లు కౌంటర్ కేసులు పెట్టడం, కేసు, కౌంటర్ కేసులు నమోదు చేయడంతో ఆయా కేసులలోని నిందితులు కేసులు రాజీ చేసుకోవడం జరుగుతుంటోంది. ఇప్పుడు అదే మాదిరిగా చంద్రబాబుపై కేసు నమోదుకు కౌంటర్ గా అదే ఆరోపణపై టీడీపీ శ్రేణులు ఓ మంత్రిపై పోలీసు స్టేషన్ లో ఇప్పుడు ఫిర్యాదు చేయడం ఆసక్తికరంగా మారింది.
మంత్రి సీదిరి అప్పలరాజుపై కర్నూలు ఒన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో టీడీపీ నేతలు రవికుమార్, థరూర్ జేమ్స్ ఫిర్యాదు చేశారు. కర్నూలులో ఎన్ 440 కే వైరస్ ఉన్నట్లు నిర్ధారణ అయ్యిందనీ, అది చాలా ప్రమాదకరమైనదని కూడా ఓ చర్చా కార్యక్రమంలో మంత్రి అప్పలరాజు పేర్కొన్నారని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు. మంత్రి వ్యాఖ్యల పట్ల ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారనీ, కోవిడ్ నిబంధనలకు విరుద్ధంగా మాట్లాడినందున ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అయితే పోలీసులు ఇంత వరకూ మంత్రి పై కేసు నమోదు చేయలేదు.