కృష్ణా జిల్లా రాజకీయాలలో ఇప్పుడు ఇదే విషయం పెద్ద సంచలనంగా మారింది. జిల్లా రాజకీయాలలో కాకలు తీరిన రాజకీయ యోధుడిగా రెండు దశాబ్దాల పాటు ఏక చక్రాధిపత్యంగా దూసుకుపోతున్న మాజీ మంత్రి దేవినేని ఉమాకు ఊహించని షాక్ తగిలింది. ఒకప్పుడు కృష్ణా జిల్లాలో దేవినేని ఉమా చెప్పిందే వేదం ఆయన చేసిందే శాసనం.. చివరకు పార్టీ అధినేత చంద్రబాబు సైతం జిల్లాలో ఉమా ఏం చెబితే అదే చేసేవారు. 2014లో పార్టీ గెలిచి ఉమా మంత్రి అయ్యాక ఆయనకు అస్సలు ఎదురులేకుండా పోయింది. ఉమా ఆడింది ఆట.. పాడింది పాటగా మారింది.
2019 ఎన్నికలలో జగన్ ప్రభంజనంలో మైలవరంలో ఉమా తన చిరకాల రాజకీయ ప్రత్యర్థి అయిన వసంత కృష్ణ ప్రసాద్ చేతిలో ఓడిపోయారు. రెండు దశాబ్దాల రాజకీయంలో ఓటమి లేకుండా దూసుకుపోతున్న దేవినేని ఉమాకు ఇదే తొలి ఓటమి. అందులోనూ తన చిరకాల రాజకీయ ప్రత్యర్థి చేతిలో ఓడిపోవడం ఉమాకు అస్సలు మింగుడు పడని అంశం. 2014లో ఉమా గెలిచిన మైలవరంలో ఆయనకు కేవలం 7 మెజార్టీ మాత్రమే వచ్చింది. కొన్ని గ్రామాలలో అనుకున్న స్థాయిలో మెజార్టీ రాకపోవడంతో సొంత పార్టీ క్యాడర్ను ఉమా దూరం పెడుతూ వచ్చారు.
2019 ఎన్నికల నాటికి ఈ దూరం మరింత పెరిగి ఆయన ఓటమికి ప్రధాన కారణం అయ్యింది. ఇక 2019 ఎన్నికలలో ఓడిపోయిన తర్వాత ఉమా నియోజకవర్గంలో పార్టీ క్యాడర్ను పెద్దగా పట్టించుకోలేదు. దీంతో మైలవరం టిడిపి అంతా ఉమా పై తీవ్ర వ్యతిరేకత పెంచుకుంది. ఇక తాజా ఎన్నికల నేపథ్యంలో తన చిరకాల రాజకీయ ప్రత్యర్థగా ఉన్న వసంత కృష్ణ ప్రసాద్ టిడిపిలోకి రావడంతో ఉమా పొలిటికల్ ఫ్యూచర్ గందరగోళం లో పడిపోయింది. వసంత కృష్ణ ప్రసాద్ టిడిపిలో చేరి తాను మైలవరం నుంచే పోటీ చేస్తానని దాదాపు సంకేతాలు ఇస్తున్నారు. అటు చంద్రబాబు సైతం కృష్ణ ప్రసాద్ కు మైలవరం సీటు ఇచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది.
ఇప్పుడు దేవినేని ఉమా ముందు ఉన్న ఒకే ఒక ఆప్షన్ పెనమలూరు. అయితే పెనమలూరు సీటుకు గట్టి పోటీ ఉంది. మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ తో పాటు పొత్తులో భాగంగా విజయవాడ ఎంపీ సీటు బీజేపీ సుజనా చౌదరికి ఇస్తే ప్రస్తుతం విజయవాడ పార్లమెంటు సమన్వయకర్తగా ఉన్న కేశినేని చిన్ని, టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు బాబాయ్ ఘట్టమనేని ఆదిశేషగిరిరావు రేసులో ఉన్నారు. ఇప్పుడు పెనమలూరులో ఉమాకు ఈ ముగ్గురి నుంచి గట్టి పోటీ ఉంది. పెనమలూరు సీటు విషయంలో టిడిపిలో సంకేతాలు ఎప్పుడు ఎలా అయినా మారిపోయే ఛాన్సులు ఉన్నాయి.
ఇంత పోటీ మధ్యలో ఉమాకు పెనమలూరు సీటు అయినా వస్తుందా అంటే సందేహంగానే కనిపిస్తోంది. ఇవన్నీ ముందుగానే అంచనా వేసుకుని ఉమా ఇప్పుడు పార్టీ అధిష్టానం పై బ్లాక్ మెయిల్ రాజకీయాలు ప్రయోగిస్తున్నట్లు తెలుస్తోంది. తనకు సీటు ఇస్తే పార్టీలో ఉంటా లేకపోతే తన దారి తను చూసుకుంటా అంటూ సన్నిహితుల వద్ద లీకులు ఇస్తున్నట్టు తెలుస్తోంది. ఈ లీకులు చంద్రబాబు దగ్గరికి వెళ్లి తనకు సీటు ఇస్తారని తనను బతిమిలాడతారని ఉమా భావిస్తున్నట్టు తెలుస్తోంది.
ఏది ఏమైనా చంద్రబాబు వెర్షన్ మరోలా ఉంది. ఉమాను ప్రస్తుతానికి బుజ్జగించి కుదిరిన పక్షంలో సీటు ఇవ్వడం లేకపోతే పార్టీ అధికారంలోకి వచ్చాక ఏదో పదవి ఇవ్వాలని చూస్తున్నట్టు తెలుస్తోంది. ఏది ఏమైనా తెలుగుదేశం పార్టీలో ఒక వెలుగు వెలిగిన ఉమాకు ఇలాంటి పరిస్థితి వస్తుంది అని ఎవరు ఊహించి ఉండరు. కాలచక్రం గిరిన తిరుగుతూ ఓడలు బండ్లు.. బండ్లు ఓడలు అవుతాయి అనేందుకు దేవినేని ఉమా పెద్ద ఉదాహరణ.