ఏపీలో వచ్చే సాధారణ ఎన్నికలలో అధికార వైసీపీని గద్ది దింపేందుకు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న తెలుగుదేశం పార్టీ – జనసేన కలిసి పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళుతున్నాయి. ఇప్పటికే తొలి జాబితాలో తెలుగుదేశం 94 స్థానాలకు.. జనసేన ఐదు స్థానాలకు అభ్యర్థులను కూడా ప్రకటించేసాయి. ఇదిలా ఉంటే చంద్రబాబు చాలా నియోజకవర్గాలలో తమ పార్టీ తరపున అభ్యర్థులు ఉన్నా కూడా ప్రకటించలేదు. బిజెపితో – జనసేన టిడిపి పొత్తు ఖరారు అయిందని.. బిజెపి కోసమే చంద్రబాబు కొన్ని స్థలాలలో అభ్యర్థులను ప్రకటించకుండా ఖాళీగా ఉంచారన్న ప్రచారం కూడా జరుగుతుంది.
ఇటీవల విశాఖలో జరిగిన సమావేశంలో బిజెపి కేంద్ర నాయకులు మాట్లాడుతూ ఏపీలో వచ్చేది తమ ప్రభుత్వం అని చెప్పడంతో పాటు పరోక్షంగా టిడిపితో బిజెపి పొత్తు ఉందన్న విషయాన్ని అంగీకరించినట్లు అయింది. ఈసారి కూడా కేంద్రంలో భారీ మెజార్టీతో వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చేందుకు బిజెపి రకరకాల ప్రణాళికలతో ముందుకు వెళుతుంది. పార్టీ బలహీనంగా ఉన్న రాష్ట్రాలలో అక్కడ బలంగా ఉన్న ప్రాంతీయ పార్టీలతో పొత్తులు పెట్టుకునేందుకు కూడా వెనుకాడటం లేదు.
బిజెపి – జనసేన టిడిపితో పొత్తు పెట్టుకున్నా ప్రధానంగా అసెంబ్లీ స్థానాల కంటే పార్లమెంటు స్థానాలపై బాగా ఫోకస్ చేసినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే టిడిపి కంచుకోటలుగా ఉన్న పలు పార్లమెంటు సీట్లను పొత్తులో భాగంగా బిజెపి కోరుతున్న మాట వాస్తవం. ఈ జాబితాలో విశాఖ, అరకు, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, రాజంపేట తిరుపతి స్థానాలు ఉన్నాయి. మరి ముఖ్యంగా ఏపీ బీజేపీ అధ్యక్షురాలుగా ఉన్న కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురందేశ్వరి కోసం తెలుగుదేశం పార్టీ ఏ సీటు కేటాయిస్తుంది ? అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్ గా ఉంది.
ఆమె 2004లో బాపట్ల, 2009లో విశాఖ నుంచి ఎంపీగా గెలిచారు. 2014లో రాజంపేట నుంచి పోటీచేసి ఓడిన ఆమె 2019 ఎన్నికలలో విశాఖ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అయితే ఈసారి పొత్తులో భాగంగా విశాఖ నుంచి పోటీ చేయాలని పురందేశ్వరి భావిస్తున్నా విశాఖ సీటును వదులుకునేందుకు టిడిపి ఎంత మాత్రం సిద్ధంగా లేదు. అక్కడ నుంచి బాలయ్య చిన్నల్లుడు భరత్ గత ఎన్నికలలో కేవలం 3000 ఓట్ల స్వల్ప తేడాతో ఓడిపోయారు. ఈసారి భరత్ అక్కడ నుంచే ఎంపీగా పోటీ చేసి పార్లమెంటులో అడుగు పెట్టాలని బలంగా నిర్ణయించుకున్నారు.
ఈ క్రమంలోనే పురందేశ్వరి కోసం చంద్రబాబు రాజమండ్రి సీటు వదులుకుంటున్నట్టు తెలుగుదేశం వర్గాల్లో ప్రచారం బలంగా నడుస్తోంది. వాస్తవంగా ఈ సీటు నుంచి ప్రస్తుతం రాజానగరం ఇన్చార్జిగా ఉన్న బొడ్డు వెంకటరమణ చౌదరిని ఎంపీగా బరిలోకి దింపుతారని అందరూ అనుకున్నారు. జనసేన పొత్తులో భాగంగా బొడ్డు వెంకటరమణ రాజానగరం సీటు వదులుకోవలసి వచ్చింది. ఇప్పుడు బిజెపితో పొత్తు ఉంటే పురందేశ్వరి కోసం ఆయన రాజమండ్రి ఎంపీ సీటు కూడా త్యాగం చేయక తప్పని పరిస్థితి.