మొక్కలను నాటి పెంచితే అవి వృక్షాలుగా మారుతాయి. మనకు నీడను, పండ్లను ఇస్తాయి. అలాగే కాలుష్యం బారి నుంచి రక్షిస్తాయి. ప్రకృతి విపత్తులు రాకుండా.. వర్షాలు సకాలంలో పడేలా చూస్తాయి. మనకు జీవించేందుకు ప్రాణవాయువును ఇస్తాయి. ఇలా చెప్పుకుంటూ పోతే వృక్షాల వల్ల మనకు ఎన్నో లాభాలు కలుగుతాయి. అందుకనే ప్రభుత్వాలు మొక్కలను నాటి పెంచాలని ప్రచారం చేస్తున్నాయి కూడా. అయితే మధ్యప్రదేశ్ మాత్రం ఆ ఒక్క వృక్షాన్ని సంరక్షించేందుకు ఎంతో శ్రమిస్తోంది. ఇంతకీ ఏంటా వృక్షం ? దాని స్పెషాలిటీ ఏంటి ? అంటే..
మధ్యప్రదేశ్లోని భోపాల్, విదిశల మధ్య ఉన్న సలామత్పూర్ అనే కొండ ప్రాంతంలో ఒకప్పుడు శ్రీలంక అధ్యక్షుడు మహీంద్రా రాజపక్స ఓ బోధి మొక్కను నాటారు. అది పెరిగి వృక్షంలా మారింది. అయితే దాన్ని సంరక్షించడం కోసం మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఏడాదికి రూ.15 లక్షల వరకు ఖర్చు చేస్తోంది. అంతేకాదు.. దానికి నిత్యం 24 గంటలూ పోలీస్ సెక్యూరిటీ కూడా ఉంటుంది. గట్టి భద్రత మధ్య ఆ వృక్షాన్ని అక్కడి ప్రభుత్వం సంరక్షిస్తోంది.
మొత్తం నలుగురు పోలీసు సిబ్బంది వారంలో 7 రోజులూ విడతల వారీగా ఆ వృక్షం దగ్గర డ్యూటీలు చేస్తారు. చెట్టుకు కాపలా ఉంటారు. ఆ చెట్టు ఇప్పటికే 15 అడుగుల ఎత్తు పెరిగింది. ఆ చెట్టు ఉన్న ప్రాంతం మొత్తం విస్తీర్ణం 100 ఎకరాలు. అదంతా కొండ ప్రాంతం కావడం విశేషం.
ఆ మొక్కను అప్పట్లో శ్రీలంక అధ్యక్షుడు మహీంద్రా రాజపక్స నాటడం ఒకెత్తయితే.. అది బోధి వృక్షం కావడం మరొక ఎత్తు. అందువల్లే ఆ చెట్టుకు అంత సెక్యూరిటీ కల్పించి.. కంచెను ఏర్పాటు చేసి మరీ అన్ని లక్షల రూపాయలను ఖర్చు పెట్టి సంరక్షిస్తున్నారు.