తెలంగాణ లో గ్రేటర్ ఎన్నికలకు ముందు ఎన్నికల ప్రచారం చాలా జోరుగా సాగుతోంది. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ హైదరాబాద్ రాజకీయాన్ని ఉడికిస్తున్నారు. ఇక ఈ క్రమంలో బిజెపి నేత ఎంపీ అరవింద్ పై కేసు నమోదు అయింది. టీఆరెఎస్ లీగల్ సెల్ వారు ఇచ్చిన ఫిర్యాదు మేరకు బిజెపి ఎంపీ పై, అతని కార్యకర్తలపై పోలీసులు కేసు నమోదు చేశారు.
హైదరాబాదులోని కెబిఆర్ పార్క్ దగ్గర్లో టిఆర్ఎస్ నేతల ఫ్లెక్సీలను చించారన్న ఆరోపణలతో అరవింద్ పైన సెక్షన్ 504, 506, 427 ల కింద కేసు నమోదు చేశారు. ఇక నిన్నటి ప్రచారంలో బీజేపీ ఎంపీ అరవింద్ టిఆర్ఎస్ పార్టీ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ లో టిఆర్ఎస్ పార్టీ మునిగిపోవడం ఖాయం అని చెప్పిన అరవింద్ గతంలో కరీంనగర్, నిజామాబాద్, దుబ్బాక ఎన్నికల్లో ప్రజలందరూ ఎలా నిజాయితీగా ఓటు వేశారు అలాగే ఈసారి ఎన్నికల్లో కూడా ఓటు వేయాలని కోరారు.
టిఆర్ఎస్ పార్టీ ముగింపు త్వరలోనే ఉందని…. ఈ ఎన్నికలు మార్పుకి కచ్చితంగా నాంది పలుకుతాయి తాను ఆశాభావం వ్యక్తం చేస్తున్నట్లు ఆయన అన్నారు. అంతేకాకుండా కొద్ది రోజుల క్రితం ఎంపీ అరవింద్ ఒక మున్సిపల్ మంత్రిగా ఉన్న కేసీఆర్ ఏజెన్సీలకు హోర్డింగులను పెట్టే ఆర్డర్లు ఇచ్చారని…. టెండర్లు పిలవకుండా ఇష్టానుసారంగా ఆయన రాత్రికి రాత్రే హోర్డింగులని ఎలా పెట్టిస్తారని ప్రశ్నించారు.
స్తంభాలు పై, టాయిలెట్ల పైన, రోడ్ల మీద ఉన్న టీఆర్ఎస్ ఫ్లెక్సీలను కార్యకర్తలు ఎక్కడికక్కడ చించేయాలని పిలుపునిచ్చారు. ఇక అలా చేసినందుకు గాను అతనిపై, అతని అనుచరులపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయ్యింది…!