YS Sharmila: రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదం నెలకొన్న నేపథ్యంలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డిని తెలంగాణ మంత్రులు టార్గెట్ చేయడం వెనుక దీర్ఘకాలిక వ్యూహం ఉందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చాలా ముందు చూపుతో ఈ వ్యవహారాన్ని నడిపిస్తున్నారంటున్నారు.
ఇంకో పది రోజుల్లో తెలంగాణలో కొత్త పార్టీ పెట్టబోతున్న రాజశేఖర్ రెడ్డి కుమార్తె షర్మిలను దృష్టి లో పెట్టుకొని ఈ రాజకీయ చాణక్యాన్ని కెసిఆర్ నడుపుతున్నారని చెబుతున్నారు.తెలంగాణలో రాజన్న రాజ్యం తెస్తానని పదే పదే చెబుతున్నా షర్మిల ముందు కాళ్లకు బంధం వేసి ప్రక్రియే ఇదంటున్నారు.ఆమె తండ్రి తెలంగాణ ద్రోహి అని ఒక బ్రాండ్ వేయడానికి ,తద్వారా షర్మిలకు జనామోదం లభించకుండా చేయడానికి ఈ రాజకీయ క్రీడను కెసిఆర్ ఆడుతున్నట్లు సమాచారం.
వైఎస్సార్ పై తీవ్రాతి తీవ్రమైన ఆరోపణలు!
ఇటీవల కాలంలో తెలంగాణ మంత్రులు వైఎస్ రాజశేఖరరెడ్డి మీద ఒంటికాలిపై లేస్తున్నారు.చనిపోయి పదేళ్లు దాటిన తర్వాత కూడా వారు రాజశేఖర్రెడ్డిని వదిలిపెట్టడం లేదు.నిజానికి గతంలో కూడా ఇలాంటి జల వివాదాలు వచ్చినప్పుడు ఆయా సందర్భాల్లో పెద్దగా రాజశేఖర్ రెడ్డిని తెలంగాణ మంత్రులు విమర్శించిన దాఖలాల్లేవు.ఈసారి మాత్రం రాజశేఖర్రెడ్డి నీటిదొంగ అంటూ కేసీఆర్ సన్నిహితుడైన మంత్రి శ్రీనివాస్ గౌడ్ గొంతెత్తారు.తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించినందుకు తీవ్రంగా రాజశేఖరరెడ్డి అవమానించడంతో మాజీ సీఎల్పీ నాయకుడు పి జనార్ధన్ రెడ్డి గుండెపోటుతో మరణించారని,ఆయనకు సమీపంలో ముఖ్యమంత్రి అంబులెన్స్ లో ఉన్న డాక్టర్లు వైద్య సహాయం అందించలేదని కూడా మంత్రి చెప్పారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఉండాలన్న మావోయిస్టు నాయకులను రాజశేఖర్రెడ్డి చర్చల పేరుతో పిలిచి చంపించేశారని ఆయన ఇంకో అభియోగం మోపారు.తెలంగాణ జలాలు, నిధులు,ఉద్యోగాలను రాజశేఖర్రెడ్డి ఆంధ్రప్రదేశ్ కి మళ్లించేశారని ఆ మంత్రి చెప్పారు.అసలు రాజశేఖర రెడ్డి బతికి ఉంటే తెలంగాణ రాష్ట్రం వచ్చి ఉండేది కాదని కూడా మంత్రి శ్రీనివాస్ గౌడ్ వ్యాఖ్యానించారు.
మంత్రి మాటల్లో మతలబు ఏంటంటే!
ఈ విధంగా మంత్రుల చేత మాట్లాడుకోవడం ద్వారా డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి తెలంగాణకు బద్ధ వ్యతిరేకి అని,ఈ ప్రాంతానికి చాలా అన్యాయం చేశారని ప్రజల్లోకి ఫీలర్స్ పంపటమే టీఆర్ఎస్ వ్యూహంగా కనిపిస్తోంది.అలాంటి రాజశేఖర రెడ్డి కుమార్తె షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టి తెలంగాణ ప్రజలకు ఏమి ఒరగ పెట్టబోతోందన్న అభిప్రాయాన్ని ప్రజలలో నాటడమనేది టీఆర్ఎస్ మరో ఎత్తుగడగా పరిశీలకులు భావిస్తున్నారు.పార్టీ పెట్టే సమయంలో గానీ, ఆ పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లే సమయంలో కానీ షర్మిల తప్పనిసరిగా రాజశేఖరరెడ్డి గురించి ప్రస్తావిస్తారు కాబట్టి ముందే ఆయనను విలన్ గా చేసి చూపడం,తద్వారా షర్మిలను ప్రజలు అనుమానించే పరిస్థితి తేవడం గులాబీ పార్టీ సాగిస్తున్న గూడుపుఠాణీ అంటున్నారు.