తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) సొమ్మును ఇకపై జాతీయ బ్యాంకుల్లోనే ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలని పాలకవర్గం నిర్ణయం తీసుకున్నది. ఈ మేరకు చైర్మన్ వైవి సుబ్బారెడ్డి నేతృత్వంలో పాలకమండలి సభ్యులు ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నారు. ప్రైవేటు బ్యాంకుల్లో భద్రత లేని కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తున్నది.
అయిదు వేల కోట్ల రూపాయల వరకూ ప్రైవేటు బ్యాంకుల్లో డిపాజిట్ చేసే వెసులుబాటు ఉన్న కారణంగా గత ప్రభుత్వ హయాంలో టిటిడి సొమ్మును ప్రైవేటు బ్యాంకుల్లో డిపాజిట్లు చేశారు. ఆలయానికి చెందిన 1400 కోట్ల రూపాయలను గత ప్రభుత్వ హయాంలో ప్రైవేటు బ్యాంకుల్లో డిపాజిట్ చేయడాన్ని పలువురు భక్తులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో కోర్టు సూచన మేరకు ఇకపై జాతీయ బ్యాంకుల్లోనే డిపాజిట్సు చేయాలని పాలకవర్గం నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తున్నది. త్వరలో 1500 కోట్ల రూపాయలు జాతీయ బ్యాంకులో డిపాజిట్ చేయాలని నిర్ణయానికి వచ్చారు.
ప్రైవేటు బ్యాంకుల్లో 8.6 శాతం వడ్డీ వస్తుండగా, జాతీయ బ్యాంకుల్లో 6.57 శాతం వడ్డీ మాత్రమే వస్తుంది. ప్రైవేటు బ్యాంకుల నుండి జాతీయ బ్యాంకులకు డిపాజిట్లను మార్చడం వల్ల టిటిడికి వడ్డీ రూపేణ అదనంగా వచ్చే సుమారు వంద కోట్ల రూపాయలు నష్టపోవాల్సి వస్తుంది.