హైదరాబాద్: టివి9 న్యూస్ ఛానల్ సిఇవోగా రవిప్రకాష్ను రెండు రోజుల క్రితమే తొలగించినట్లు నూతన యాజమాన్యం ప్రకటించింది. శుక్రవారం షేర్హోల్డర్ల సమావేశం నిర్వహించిన కొత్త యాజమాన్యం అనంతరం మీడియాతో మాట్లాడింది. రవిప్రకాష్ స్థానంలో టివి9 కన్నడ ఛానల్ సిఇవో మహేంద్ర మిశ్రాను తాత్కాలికంగా నియమించారు. చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్గా ప్రస్థుతం 10టివి సిఇవోగా ఉన్న గొట్టిపాటి సింగారావును నియమించారు.
టివి9 గ్రూప్ యాజమాన్య సంస్థ అయిన ఎబిసిఎల్ డైరక్టర్ల బోర్డు సమావేశం గురువారం జరిగింది. టివి9 గ్రూప్ను కొనుగోలు చేసిన వారి తరపునుంచి కొత్తగా బోర్డులోకి వచ్చిన డైరక్టర్లు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ బోర్డు రవిప్రకాష్ను తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది.
ఈరోజు జరిగిన షేర్హోల్డర్ల సమావేశం బోర్డు తీసుకున్న నిర్ణయాలను ఆమోదించిందని ఎబిసిఎల్ కొత్త డైరక్టర్ సాంబశివరావు మీడియాకు చెప్పారు. మరో డైరక్టర్ మూర్తిని కూడా తొలగించినట్లు ఆయన చెప్పారు. అయితే రవిప్రకాష్పై దాఖలయిన కేసు గురించి మాట్లాడేందుకు ఆయన నిరాకరించారు.
రవిప్రకాష్పై కొత్త యాజమాన్యం తరపున పోలీసు కేసు దాఖలయిన విషయం తెలిసిందే. ఫోర్జరీ, మోసం, నిధుల మళ్లింపు వంటి అభియోగాలతో సైబర్ క్రయిం పోలీసుల వద్ద కేసు నమోదు చేశారు. దరిమిలా పోలీసులు రవిప్రకాష్ నివాసంలో, మరో డైరక్టర్ మూర్తి నివాసంలో, టివి9 కార్యాలయంలో, రవిప్రకాష్ సన్నిహితుడు, సినీ నటుడు శివాజీ నివాసంలో సోదాలు జరిపారు.
తమ ముందు హాజరు కావాల్సిందిగా పోలీసులు ఇచ్చిన నోటీసుకు రవిప్రకాష్ ఇంకా స్పందించలేదు. మూర్తి మాత్రం ఈరోజు పోలీసుల ముందు హాజరయ్యారు. టివి9 పరిణామాలపై మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతుండగా గురువారం సాయంత్రం రవిప్రకాష్ నాటకీయంగా టివి9 స్టూడియోలో కూర్చుని ఎలక్ట్రానిక్ మీడియాలో వస్తున్న వార్తలన్నీ అబద్ధాలేనని పేర్కొన్నారు.